నకిలీ టీఆర్పీ రేటింగుల బాగోతం: ఆర్నబ్ తరువాత మరో బిగ్ వికెట్: రిపబ్లిక్ టీవీ సీఈఓ అరెస్ట్
ముంబై: జాతీయ స్థాయిలో ప్రకంపలను సృష్టించిన నకిలీ టీఆర్పీ రేటింగుల బాగోతం.. కొత్త మలుపు తిరిగింది. మరో బిగ్ వికెట్ పడింది. రిపబ్లిక్ టీవీ ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అరెస్ట్ అయ్యారు. నకిలీ టీఆర్పీల వ్యవహారంలో ఇది రెండో అరెస్ట్. ఇదవరకు ఆ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ అయ్యారు. బెయిల్పై విడుదల అయ్యారు. తాజాగా అదే ఛానల్ సీఈఓ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
ఇప్పటిదాకా ఈ కేసులో 13 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బంది, ఉన్నత స్థానంలో ఉన్న వారిని అరెస్ట్ చేయవద్దంటూ రిపబ్లిక్ టీవీ ఛానల్ యాజమాన్యం ఏఆర్జీ అవుట్లయర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఈ పిటీషన్ను తోసిపుచ్చిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఛానల్ సీఈఓ వికాస్ ఖన్చందాని అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం ఆయనను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది అక్టోబర్లో నకిలీ టీఆర్పీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన టీఆర్పీ రేటింగుల్లో రిపబ్లిక్ టీవీ యాజమాన్యం మానిప్యులేషన్కు పాల్పడినట్లు తేలింది. దీనితో బార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కౌన్సిల్ తరఫున హంసా రీసెర్చ్ గ్రూప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఇదే కేసులో మరి కొన్ని ఛానళ్ల ప్రతినిధులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ టీఆర్పీల వ్యవహారంలో ఇప్పటిదాకా 13 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో విచారణను కొనసాగించవద్దని కోరుతూ కిందటివారం రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. విచారణపై స్టే ఇవ్వాలని ఆయన విజ్ఙప్తి చేశారు. విచారణ సందర్భంగా పోలీసులు తమ సంస్థ ఉద్యోగులు, సిబ్బందిని చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది విచారణకు రావాల్సి ఉంది. అదే సమయంలో- ముంబై పోలీసులు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా సీఈఓ వికాస్ ఖన్చందానీని అరెస్ట్ చేశారు.