సినీఫక్కీలో పోలీసుల ఛేజ్.. నలుగురి అరెస్టు.. రూ.1.51 కోట్ల పాత నోట్లు స్వాధీనం
ముంబై పోలీసులు సినీఫక్కీలో ఓ ట్యాక్సీ క్యాబ్ ఛేజ్ చేసి.. అందులో రవాణా అవుతున్న రూ.1.51 కోట్ల పాతనోట్లను పట్టుకున్నారు.
ముంబై: రద్దయిన నోట్లు డిపాజిట్ చేసుునేందుకు సామాన్యులకు గడువు ముగిసింది. అయినా సరే ఇంకా కోట్ల రూపాయల పాత నోట్లు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. అసలీ రద్దయిన నోట్లు ఇంత భారీ మొత్తంలో ఎక్కడికి తీసుకెళతారో, ఎలా మార్చుకుంటారో దేవుడికే తెలియాలి.
తాజాగా ముంబై పోలీసులు సినీఫక్కీలో ఓ ట్యాక్సీ క్యాబ్ ఛేజ్ చేసి.. అందులో రవాణా అవుతున్న రూ.1.51 కోట్ల పాతనోట్లను పట్టుకున్నారు. నగదును సీజ్ చేసిన పోలీసులు నలుగురు నిందితులను ఘాట్కోపార్ లో అరెస్టు చేశారు.
ఈ పాత నోట్లను కొత్త కరెన్సీలోకి మార్చుకోవడానికి ట్యాక్సీ క్యాబ్ లో తరలిస్తున్న క్రమంలో అవి పోలీసులు కంట పడ్డాయి. పది నిమిషాల పాటు పోలీసులు ఈ ట్యాక్సీని వెంటాడి ఎట్టకేలకు ఘాట్కోపార్ లోని ఎల్బీసీ మార్గ్ రోడ్డులో పట్టుకోగలిగారు. క్యాబ్ వెనక సీటులో రెండు బ్యాగుల్లో ఉంచిన కోటిన్నర రూపాయలకు పైగా పాతనోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో వెంటనే క్యాబ్ డ్రైవర్ రిజ్వాన్ గులామ్ ఖాజీతోపాటు కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు.. అయాజ్ అక్తర్, దానిష్ రఫీ, రెహాన్ సైఖ్ లను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు కేవలం మధ్యవర్తులు మాత్రమే.. అసలైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ సచిన్ పాటిల్ తెలిపారు.
ఈ నిందితులందరూ దక్షిణ ముంబైకి చెందిన వారే. గొరై ప్రాంతంలోని ఓ వ్యక్తికి ఈ పాతనోట్లు డెలివరీ చేయడానికి తీసుకెళుతున్నట్లు తెలిసిందని, ఇందులో ఎవరైనా ఎన్నారైల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.