కేసులు వదిలించుకోడానికే హేమ హత్య: భర్త చింతన్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ప్రముఖ కళాకారిణి హేమా ఉపాధ్యాయ్(43), ఆమె తరపు న్యాయవాది హరీశ్ భంబానీ(65) కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో హేమ భర్త చింతన్ ఉపాధ్యాయ్ను నిందితుడిగా గుర్తిస్తూ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా, పోలీసులు విచారించగా.. కోర్టు కేసులు వదిలించుకోడానికే హేమా ఉపాధ్యాయ్ను హత్య చేసినట్లు ఆమె భర్త చింతన్ అంగీకరించాడు. కేసు వివరాల్లోకి వెళితే.. చింతన్, హేమా దంపతులిద్దరూ చిత్రకారులే. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో హేమ 2013లో చింతన్పై కేసు పెట్టింది.
అయితే కోర్టు కేసులతో విసిగెత్తిపోయిన చింతన్ ఎలాగైనా తన భార్యను చంపేందుకు నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం రెండు నెలల క్రితం విద్యాధర్ అనే మరో వ్యక్తితో కలిసి పథకం రచించాడు. విద్యాధర్ డిసెంబర్ 12న తన మనుషులతో హేమకు ఫోన్ చేయించాడు.
తమ వద్ద కొన్ని సాక్ష్యాలు ఉన్నాయని.. ఇవి చింతన్ నుంచి విడాకులు తీసుకునేందుకు ఉపయోగపడుతాయని హేమకు చెప్పారు. దీంతో హేమ వారిని దాదర్కు రమ్మని చెప్పింది. అయితే దాదర్ అంత సురక్షితం కాదని.. హేమను విద్యాధర్ వేర్హౌస్కు రమ్మని పిలిచారు.
ఇందుకు అంగీకరించిన హేమ, తన లాయర్ హరీశ్తో కలిసి వేర్హౌస్కు వెళ్లగా.. అక్కడ విద్యాధర్ వీరిద్దరినీ చంపేసి అట్టపెట్టెలో కుక్కి.. మృతదేహాలను సమీపంలోని చెత్తకుప్పల వద్ద పడేశారు.
కాగా, డిసెంబర్ 13న మృతదేహాలను గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో చింతన్ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. మంగళవారం అరెస్టు చేశారు. అతడ్ని విచారించగా.. తానే చంపినట్లు చింతన్ అంగీకరించాడు. కాగా, ప్రస్తుతం చింతన్కు జనవరి 1 వరకు కస్టడీ విధించారు.