ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో అలజడి.. మరో పోలీస్ కానిస్టేబుల్ మృతి..
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా చికిత్స పొందుతున్న 56ఏళ్ల ఓ హెడ్ కానిస్టేబుల్ సోమవారం మృతి చెందాడు. కొద్దిరోజుల క్రితం అతను ముంబైలో అతిపెద్ద కోవిడ్-19 హాట్స్పాట్గా ఉన్న కుర్లా డివిజన్లోని L-వార్డులో విధులు నిర్వహించాడు.మృతుడు శివాజీ సోనవానే అని ముంబై పోలీసులు వెల్లడించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.
సోనవానే మృతితో ముంబైలో ఇప్పటివరకూ కోవిడ్-19తో మృతి చెందిన పోలీస్ సిబ్బంది సంఖ్య 3కి చేరింది. వకోలా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న చంద్రకాంత్ పెందుర్కర్ అనే కానిస్టేబుల్ ముంబైలో కరోనాతో మృతి చెందిన మొదటి పోలీస్ సిబ్బంది. శనివారం అతను మృతి చెందగా.. ఆదివారం సందీప్ సర్వే(52) అనే మరో కానిస్టేబుల్ కరోనా కారణంగా మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా సోనవానే మృతి చెందాడు. ముగ్గురు పోలీసుల మృతితో ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో ఆందోళన నెలకొంది.
దేశవ్యాప్తంగా సోమవారం(ఏప్రిల్ 27) నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29255కి చేరింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 8590,గుజరాత్లో 3548,ఢిల్లీలో 2918,రాజస్తాన్లో 2262,మధ్యప్రదేశ్లో 2165 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు రెండు వేల మార్కుకు దగ్గరలో ఉన్నాయి. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వెయ్యి మార్కును దాటాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో లాక్ డౌన్పై చర్చించారు. అన్ని రాష్ట్రాలు కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీతో ముందుకు రావాలని సూచించారు.