ఔను.. పోలీసులు బిల్లు చెల్లించరు.. ఒకటి కాదు.. రెండు కాదు... 93 కోట్ల బకాయి, ఎక్కడో తెలుసా
ముంబై : మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సిటీలకు ఆయా ప్రభుత్వ విభాగాలు బకాయి పడుతుంటాయి. పన్ను కట్టలేదని, పవర్ బిల్లు చెల్లించలేదనే వార్తలు చూస్తుంటాం. ఇటీవల మంచినీరు కట్టని ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అదీ కూడా సీఎం, మంత్రులు, పోలీసులు ... మంచినీళ్ల బిల్లు కట్టకపోవడం చర్చకు దారితీసింది. అయితే వారు కట్టాల్సింది కూడా పెద్ద మొత్తంలో కావడంతో సమాచార హక్కు చట్టం ద్వానా విషయం వెలుగులోకి వచ్చింది.
సీఎం, మంత్రులు, పోలీసులు
ముంబై .. మహానగరం, దేశ ఆర్థిక రాజధాని. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. అలా అని నీరు బంగారమే. ఉన్న కొన్ని నీటిని వాడుకోవాలి. ఇది సామాన్యుల విషయం. మరీ సీఎం, మంత్రులు, పోలీసులకు వర్తించదు. ఎందుకంటే వారు నీరు వాడటమే కాదు .. బిల్లు కూడా కట్టరు. అవును మీరు విన్నది నిజమే. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కార్యాలయం బృహన్ ముంబై కార్పొరేషన్కు బిల్లు చెల్లించడం లేదు. ఏడాది, రెండేళ్లు కాదు .. 2001 నుంచి బిల్లు కట్టలేదు. దీంతో రూ.7.44 లక్షలకు బిల్లు చేరింది. అంతేకాదు మంత్రులు సుధీర్, పంకజ్ ముండే, రాంధాస్ సహా 18 మంత్రులు కూడా మంచినీటి బిల్లు కట్టని దుస్థితిలో ఉన్నారు.
ఖాకీలు కూడా ..
సీఎం, మంత్రులను వదిలేస్తే .. పోలీసులది కూడా సేమ్ సిచుయేషన్. గత కొన్నిరోజులుగా ముంబై పోలీసుశాఖ బీఎంసీకి బిల్లు చెల్లించడం లేదు. దీంతో వారి బకాయి రూ.93 కోట్లకు చేరింది. దీంతో పోలీసుశాఖను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్టు బీఎంసీ వర్గాలు తెలిపాయి. పోలీసుశాఖ మంచినీటి బిల్లు కట్టని విషయం .. బీఎంసీకి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో వెలుగుచూసింది. షకీల్ అహ్మద్ షేక్ అనే వ్యక్తి దరఖాస్తు చేయగా .. బిల్లు మొత్తం తెలిసింది. కేంద్ర, పశ్చి, రైల్వే పోలీసు విభాగంతోపాటు ముంబై పోలీసుశాఖ బీఎంసీక 93 కోట్ల 85 లక్షల బకాయి పడింది. దీంతోపాటు పోలీసు కమిషనర్, డీజీపీ ఆఫీసు, ట్రాఫిక్ పోలీసు, జీఆర్పీ పోలీసు కార్యాలయంలో ఒకటి కంటే ఎక్కువ నల్లా కనెక్షన్లు ఉన్నట్టు పేర్కొన్నది.
ఇదేం పద్ధతి
నలుగురికి ఆదర్శంగా నిలువాల్సిన పెద్దలు ఇలా ప్రవర్తించడం ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాసులు మంచినీటి బిల్లు కట్టరు కానీ .. ప్రజలను కట్టాలని కోరతారా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముందు మీరు కట్టి ఆదర్శంగా నిలిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అలా చేయకుండా ప్రజలను బిల్లులు కట్టమనడం సరికాదన్నారు. సాధారణ ప్రజలు బిల్లు కట్టకుంటే .. ఉపేక్షించని బీఎంసీ అధికారులు .. వీరిపై మాత్రం ఎందుకు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది సరికాదని .. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని పేర్కొన్నారు.