కంగనా రనౌత్కు సెకెండ్ షాక్: ఈ సారి రాకపోతే.. అరెస్ట్ తప్పనట్టే: చెల్లెలికి కూడా
ముంబై: వివాదాస్పదమైన సోషల్ మీడియా పోస్టు వ్యవహారంలో ముంబై పోలీసులు మరోసారి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్కు రెండోసారి సమన్లను జారీ చేశారు. కంగనాతో పాటు ఆమె చెల్లెలు రంగోలి చందేల్కూ నోటీసులను పంపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో వారిద్దరు చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. దీనిపై ఇదివరకే వారికి ముంబై పోలీసులు సమన్లను జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ?: బ్యానర్లు: బీజేపీ మిత్రపక్ష పార్టీలో?: కర్ణిసేన ఓటుబ్యాంకు
తొలిసారిగా నోటీసులను పంపించిన సమయంలో ఆమె విచారణకు హాజరు కాలేదు. దీనితో తాజాగా మంగళవారం రెండోసారి సమన్లు ఇచ్చారు. ఈ సారి ఆమె విచారణకు హాజరు కాకపోతే.. అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించడం, ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్గా అభివర్ణించిన సమయంలో కంగనా రనౌత్పై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో ఆమె ఓ వివాదాస్పదమైన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వాటిపై నమోదైన కేసులకు అనుగుణంగా బాంద్రా కోర్టు కిందటి నెల 21వ తేదీన ఆమెకు సమన్లను జారీ చేసింది. అదే నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీనికి ఆమె నుంచి ఎలాంటి బదులు రాలేదు. దీనితో తాజా మరోసారి కంగనాతో పాటు ఆమె సోదరికి ముంబై పోలీసులు నోటీసులను పంపించారు. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని, లేకపోతే.. ఆ తరువాతి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.