నటి ప్రీతి జింటాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతి జింటా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో పోలీసులు ఆమెను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు. ప్రీతి జింటాపై స్క్ర్రిప్టు రైటర్ అబ్బాస్ తైరేవాలా కోర్టుకు ఫిర్యాదు చేశారు.
తనకు ప్రీతి జింటా 18 లక్షల రూపాయలకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని ఆరోపించారు. ఈ కేసులో ముంబై కోర్టు ఇంతకు ముందు ఆమెకు సమన్లు జారీ చేసింది. వరుసగా నాలుగు సార్లు కోర్టుకు ప్రీతి జింటా హాజరు కాలేదు. దీంతో గురువారం ప్రీతి జింటా అరెస్టుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.
తాను రాజకీయాల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటన చేసి ప్రీతి జింటా ఇంతకు ముందు వార్తల్లోకి ఎక్కారు. దేశంలోని అవినీతిని అంతం చేయడానికి తాను రాజకీయాల్లో చేరాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
మనదేశంలో సంభవిస్తున్న పరిణామాలు చాలా విచారకరంగా ఉన్నాయని, దాంతో తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని ప్రీతి జింటా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశాన్ని సానుకూల దిశలో నడిపించడానికి ఏదో ఒక రోజు తాను రాజకీయాల్లోకి వచ్చి తనకు ఓటు వేయాలని కోరుతానని చెప్పారు.