ముంబైలో నీటిలో చిక్కుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు, వాతావరణ శాఖ హెచ్చరిక
మంగళవారం కురిసిన భారీ వర్షానికి ముంబై వణికిపోయింది.ఎడతెరిపిలేని కుండపోత వర్షం, బలమైన గాలులు, నీట మునిగిన రహదారులతో ముంబై ప్రజలు నరకయాతన అనుభవించారు.
ముంబై: మంగళవారం కురిసిన భారీ వర్షానికి ముంబై వణికిపోయింది. ఎడతెరిపిలేని కుండపోత వర్షం, బలమైన గాలులు, నీట మునిగిన రహదారులతో ముంబై ప్రజలు నరకయాతన అనుభవించారు.
అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో బుధవారం ఉదయానికి పరిస్థితి కాస్త మెరుగుపడింది. బస్సులు, లోకల్ రైళ్ల సర్వీసులు ప్రారంభం కావడంతో ప్రయాణికులకు కాస్త వూరట కలిగింది. 2005 తర్వాత ఇంత భారీగా కురవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాలతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఉద్యోగులు, ప్రజలు రాత్రి 11 వరకు రైల్వేస్టేషన్లోనే పడిగాపులు కాశారు. రాత్రి 11 గంటల నుంచి నెమ్మదిగా రైళ్లు కదలడంతో ఇంటికి చేరుకోగలిగారు. వారి కోసం రాత్రంతా రైలు సర్వీసులు నడిపారు.
సెలబ్రిటీల ఇబ్బంది
భారీ వర్షాల నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. వీధులన్నీ జలమయం కావడంతో అనుపమ్ ఖేర్, మాధవన్ వంటి నటులు నీటిలో చిక్కుకుపోయారు. వారు సోషల్ మీడియాలో తమ బాధలు కూడా చెప్పారు.
అనుపమ్ ఖేర్ పోస్ట్
సాంటా క్రజ్ వద్ద తాను తన కారులో ఉన్నప్పుడు నీటిలో చిక్కుకుపోయానని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. దీంతో తాను బాంద్రాలోని తన స్నేహితుల సహకారం అడిగానని చెప్పారు. తన కారు నీటిలో చిక్కుకుపోవడంతో వెంటనే కారు దిగి, బాంద్రాలోని తన స్నేహితుడికి ఫోన్ చేశానని చెప్పారు. ప్రస్తుతం తాను తన స్నేహితుడి ఇంట్లో ఉన్నానని చెప్పారు. అనుపమ్ ఖేర్ రాత్రి 8 గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు.
వీడియో పోస్ట్ చేసిన మాధవన్
నటుడు మాధవన్ కూడా ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన ఇంటికి కొద్ది దూరంలోనే అతని కారు భారీ వర్షం, వరద నీరు కారణంగా ఇబ్బంది పెట్టింది. అతను కారులో నుంచి రోడ్డును వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరిక
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ, డామన్ - డయ్యు తదితర 12 రాష్ట్రాల్లో మరిన్ని భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే భారీ వరదలు వచ్చే అవకాశముందని తెలిపింది.