వరదలకు ముంబై అతలాకుతలం: కారణాలు ఏమిటంటే?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 288 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రాణనష్టం పెద్దగా జరగకపోయినా, పౌర జీవితం అస్తవ్యస్తమైంది.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 288 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రాణనష్టం పెద్దగా జరగకపోయినా, పౌర జీవితం అస్తవ్యస్తమైంది.
ఇందుకు పూర్తి బాధ్యత స్థానిక మున్సిపాలిటీ, పాలకులదే. పన్నెండేళ్ల క్రితం 2005లో జూలై 26న 24 గంటల్లో 944 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ముంబై చిగురుటాకులా వణికిపోయింది. అప్పుడు ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది.
పక్కనే సముద్రం, నైసర్గిక స్వరూపం కారణంగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని పాలకులకు తెలిసిందే.
ముంబైలో నీటిలో చిక్కుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు, వాతావరణ శాఖ హెచ్చరిక
అందుకే ముంబై మున్సిపల్ కార్పోరేషన్ 1985లో బ్రిటిషన్ ప్రముఖ కన్సల్టెంట్ వాట్సన్ హక్షీని పిలిపించి గంటకు 50 మిల్లీ మీటర్ల వర్షం పడినా తట్టుకునేలా పటిష్టమైన నాలా వ్యవస్థకు ప్రణాళిక రూపొందించాలని కోరింది.
దానిని అప్పుడు బృహన్ ముంబై స్మార్ట్ వాటర్ డ్రెయినేజ్ రిపోర్టుగా పేర్కొన్నారు. అయితే అధికారులు సకాలంలో పని జరిగేలా చూడకపోవడంతో కన్సల్టెంట్ తన ప్రణాళికను రూపొందించి ఇచ్చేందుకు ఎనిమిదేళ్లు పట్టింది.
దానిని అరకొరగా అమలు చేయడానికి మున్సిపల్ పాలకులకు 12 ఏళ్లు పట్టింది. ఫలితంగా 2005లో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ రిటైర్డ్ ఇంజనీర్లతో స్థానిక మున్సిపాలిటీ ముంబై వికాస్ సమితిని ఏర్పాటు చేసింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగింటి వాటర్ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు మరో ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది. ఆ సమితి ముంబైలో వర్షాలు పడే 121 ప్రాంతాలను గుర్తించింది. అందుకు అనుగుణంగా ప్రణాలిక రూపొందించింది.
దానిని అమలు చేసేందుకు రూ.616 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేసింది. వాటిలో రూ.260 కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించి చిన్న చిన్న పనులనే స్థానిక పాలకులు అమలు చేశారు.
ఏటా రూ.30 వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఉండే ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వరద సహాయక చర్యల కింద రూ.200, రూ.300 కోట్లు ఖర్చు పెడుతుంది కానీ, వరద నివారణలకు ముందుగా ఖర్చు పెట్టడానికి మాత్రం ముందుకు రాదంటున్నారు.