సచిన్: వాంఖడేలో అదే నిరాశ, అంజలి నెర్వస్
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చివరిదైన 200వ టెస్టులో సెంచరీ సాధిస్తాడని అభిమానులు భావించారు.. అయితే వెస్టిండీస్ జట్టుతో గురువారం ప్రారంభమైన మ్యాచు తొలి ఇన్నింగ్స్లో 74 పరుగులతో రాణించిన మాస్టర్ సెంచరీ సాధిస్తాడనుకున్నా నిరాశ పరిచాడు. సచిన్ టెండూల్కర్ 1997లో వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 148 పరుగులు సాధించాడు. అప్పటి నుంచి అంటే 15 సంవత్సరాల నుంచి వాంఖేడే స్టేడియం మాస్టర్ సెంచరీ కోసం ఎదురుచూస్తూనే ఉంది. సెంచరీ సాధించకుండానే సచిన్ అవుటయ్యాడు.
అయితే వాంఖేడే స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 38 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ తర్వాత రోజు సెంచరీ పూర్తి చేస్తాడని అభిమానులు అంతా భావించారు. కానీ మాస్టర్ 74 పరుగులు చేసి వెనుదిరగడంతో కొంత నిరాశకు గురయ్యారు మాస్టర్ అభిమానులు. ఈ మ్యాచులో 74 పరుగులు చేయడం ద్వారా సచిన్ 68 అర్థ సెంచరీలను సాధించాడు. ఇప్పటికే టెస్టులలో 52 సెంచరీలు సాధించిన మాస్టర్ అగ్రస్థానంలోనే ఉన్నాడు.
15 సంవత్సరాల తర్వాతైనా సెంచరీ సాధించి తన సొంత స్టేడియం తనకు అనుకూలంగా ఉందని నిరూపిస్తాడని అభిమానులు భావించారు. కానీ అలా జరగలేదు. నర్సింగ్ డియోనరేన్ వేసిన బంతి మాస్టర్ బ్యాట్ ఎడ్జ్కి తగిలి కెప్టెన్ డారెన్ సమి చేతిలోకి వెళ్ళడంతో సచిన్ వెనుదిరిగాడు. 221 పరుగుల వద్ద సచిన్ ఔటయ్యాడు. అప్పటికి ఇండియా 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. మాస్టర్ తన ఇన్నింగ్స్లో 118 బంతులు ఆడి 12 బౌండరీలను బాదాడు.
మాస్టర్ ఔటవడంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్ధంగా మారింది. తర్వాత తేరుకున్న అభిమానులు సచిన్ వీడ్కోలు మ్యాచ్ అన్న సంగతిని గుర్తించి నిల్చుని చప్పట్లు కొడుతూ అతనికి అభినందనలు తెలిపారు. సచిన్ చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచును అతని తల్లి రజని, భార్య అంజలి, కుమారుడు అర్జున్, కుమార్తె సారాలు, పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. సచిన్ టెండూల్కర్ అవుట్ కాగానే మీడియా కెమెరాలన్నీ అంజలివైపు ఫోకస్ చేశాయి. ఆమె నెర్వస్గా కనిపించారు.