రియాకు బెయిల్ నిరాకరణ.. తిరిగి బైకుల్లా జైలుకు.. బాంబే హైకోర్టులో ప్రయత్నం
ముంబై: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన రియా చక్రవర్తి బెయిల్ కోసం ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. విచారణ ముగిసింది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది. మృతి చెందిన బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్పుత్కు ఆమె డ్రగ్స్ సప్లయ్ చేశారన్న ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Recommended Video
దీంతో ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఆమె బెయిల్కు దరఖాస్తు చేసుకోగా సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. ఇదే కేసుకు సంబంధించి రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్పై విచారణ చేసింది. షోవిక్కు కూడా బెయిల్ నిరాకరించింది సెషన్స్ కోర్టు. సెప్టెంబర్ 4వ తేదీన షోవిక్ చక్రవర్తి అరెస్టయ్యాడు.
మంగళవారం రోజున ఎన్సీబీ కార్యాలయంలో విచారణ పూర్తయ్యాక బుధవారం రోజున రియా చక్రవర్తిని ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. అక్కడే షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీ కూడా ఉంది. అంతేకాదు భీమా కోరెగావ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సుధా భరద్వాజ్ కూడా ఈ జైలులోనే ఉన్నారు. తాజాగా బైకుల్లా జైలులో ఉన్న రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ను సెషన్స్ కోర్టు నిరాకరించడంతో ఆమె తిరిగి బైకుల్లా జైలుకే పరిమితమైంది.
సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రియా చక్రవర్తి బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆమె సన్నిహితులు చెప్పారు. తను నిరపరాధినని ఎన్సీబీ కావాలనే తనను డ్రగ్స్ కేసులో ఇరికిస్తోందని రియా తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు తనను బలవంతం పెట్టి నేరం చేసినట్లుగా ఒప్పుకునేలా చేశారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఇక నేరం కనుకు రుజువైతే రియా పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.