తుఫాను అప్డేట్స్: ముంబైకి భారీ వర్ష సూచన..గుజరాత్ వైపు కదులుతున్న వాయు తుఫాను
Recommended Video
గుజరాత్కు వాయు తుఫాను రూపంలో ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వాయు తుఫాను క్రమంగా గుజరాత్ తీరంవైపు కదులుతోంది. వాయు తుఫాన్ కదలికలపై కేంద్ర హోంశాఖ చాలా దగ్గరగా సమీక్షిస్తోంది. ఇప్పటికే అధికారులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తుండగా, రెస్క్యూ టీమ్లు, భారత ఆర్మీ కూడా ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఉత్తరం దిశగా వాయు తుఫాను వేగంగా కదులుతోంది.
మళ్లీ తెరపైకి ట్రిపుల్ తలాక్పై బిల్లు? ఈసారైనా గట్టెక్కేనా?
గంటకు 140 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు
వాయు తుఫాను ఉత్తరం దిశగా కదులుతూ గుజరాత్లోని పోరబందర్ మహువాల మధ్య తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో తుఫాను బలపడుతుందని తీరం దాటే సమయంలో గంటకు 140 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. జూన్ 13 నాటికి గుజరాత్లో వాయు తుఫాను తన ప్రతాపం చూపుతుందని అధికారులు వెల్లడించారు. ఇక తుఫాను పెను బీభత్సం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావించాయి. వీరందరినీ 700 రిలీఫ్ సెంటర్లకు తరలిస్తారు.
రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఇక నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇప్పటికే 39 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉంచింది. ఒక్కో బృందంలో 45 మంది రెస్క్యూర్లను సిద్ధంగా ఉంచింది. ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా బోట్లను, చెట్లు పడిపోతే తొలగించే యంత్రాంగాన్ని,టెలికాం ఎక్విప్మెంట్ను సిద్ధంగా ఉంచింది. మరోవైపు 34 బృందాలతో కూడిన ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. ఇక ఇండియన్ ఎయిర్ఫోర్స్ సీ-17 రవాణా విమానాన్ని సిద్ధంగా ఉంచింది. విపత్తు సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆయా ప్రాంతాల్లో తరలించేందుకు వినియోగించనున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతేకాదు గుజరాత్ డామన్ డుయిలోని అధికారులను హోంశాఖ అలర్ట్ చేసింది. ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని హోంశాఖ సూచించింది.ఇక తుఫాను వెళ్లిపోయిన తర్వాత సహాయక చర్యలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
ముంబైకి భారీ వర్ష సూచన
బుధవారం ఉదయం వాయు తుఫాను ముంబై తీరం మీదుగా పయనించినట్లు వాతావరణశాఖ తెలిపింది. ముంబైలో బీభత్సం సృష్టించకపోయినప్పటికీ నగరంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.కొంకణ్ తీరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. బుధవారం ఉదయం వాయు తుఫాను వేగం 135 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లుగా రికార్డు అయ్యిందని అధికారులు తెలిపారు. ఇక తుఫాను ప్రస్తుతం ముంబైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉందని...సాయంత్రానికల్లా ముంబై తీరం తాకుతుందని వెల్లడించారు. మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లరాదని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.