పగలు స్కూల్.. రాత్రి హోటల్!? అవాక్కయిన ఉపముఖ్యమంత్రి!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా .. ఓ పాఠశాలలోని దృశ్యాలను చూసి అవాక్కయ్యారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా .. ఓ పాఠశాలలోని దృశ్యాలను చూసి అవాక్కయ్యారు.
గురువారం రాత్రి కళ్యాణ్పురిలోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ను సందర్శించిన సిసోడియా తరగతి గదిలో ఓ జంట ఉండటం చూసి విస్తుపోయారు. వారు ఏకంగా తరగతి గదిలోనే వంటా వార్పూలో మునిగిపోవడంతో మంత్రితో పాటు పోలీస్ అధికారులు, ఇతరులు కూడా ఆశ్చర్యపోయారు.
ఆ గదిలో ఇంకా గ్యాస్ సిలిండర్, కార్పెంటర్ పరికరాలతో గూడిన బ్యాగ్ కనిపించాయి. అసలేమిటిదంతా అంటూ ఉపముఖ్యమంత్రి ఆరా తీయగా.. స్కూల్ వాచ్ మన్ తమ బంధువులకు తరగతి గదిని అద్దెకు ఇచ్చినట్లు వెల్లడయింది.
మూడు నెలలుగా ఈ తంతు జరుగుతోందని తెలిసి మనీష్ సిసోడియా కంగు తిన్నారు. ఈ విషయం స్కూల్ ప్రిన్పిపల్కూ తెలుసని స్కూల్ వాచ్ మన్ చెప్పడం గమనార్హం. అధికారులు ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. అనంతరం స్కూల్ నిర్వాకాన్ని ఉప ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇలాంటి ఘటనలను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.