మళ్లీ చిక్కుల్లో మున్నాభాయ్.. నిర్మాత షకీల్ నూరాని కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. నిర్మాత షకీల్ నూరాని కేసులో మున్నాభాయ్పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ముంబై: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైలు నుంచి గత ఏడాది విడుదలైన మున్నాభాయ్పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
నిర్మాత షకీల్ నూరాని కేసులో ఈ వారెంట్ జారీ అయింది. విచారణకు సంజయ్ గైర్హాజరు అయినందున కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధం ఉందనీ, ఆయన ప్రోద్బలంతోనే తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించిన నూరాని ఈ మేరకు కేసు దాఖలు చేశారు.
సంజయ్ తనతో ఒక చిత్రం చేసేందుకు 2002లో ఒప్పందం కుదుర్చుకుని దానిని ఉల్లంఘించారనేది నూరాని ఆరోపణ. దీనికి సంబంధించి సంజయ్ తనకు రూ.50 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉందని, ఒప్పందం ఉల్లంఘన వల్ల తనకు రూ. 2 కోట్లు నష్టం వాటిల్లిందని నూరాని తన పిటిషన్ లో పేర్కొన్నారు.
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న నేరంపై సంజయ్ దత్ కు కోర్టు అయిదేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే 42 నెలల జైలు జీవితం గడిపిన తరువాత.. ఇంకా శిక్షా కాలం మిగిలి ఉండగానే సత్ర్పవర్తన కారణంగా.. ఆయన విడుదలయ్యారు.
మరోవైపు బాలీవుడ్ లో సంజయ్ దత్ బయో పిక్ రూపొందుంతోంది. ఆయన రియల్ లైఫ్ స్టోరీని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ తెరపైకి తీసుకురాబోతున్నారు. 'దత్' బయోపిక్ కు సంబంధించి రణబీర్ మేకోవర్ ఫోటోలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిర్మాత షకీల్ నూరాని కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో సంజయ్ దత్ మళ్లీ చిక్కుల్లో పడ్డట్లే.