ఆ లేఖ నేను రాయలేదు : చర్యలు తీసుకోవాలని సీఈసీకి జోషి లేఖ
న్యూఢిల్లీ : సోషల్ మీడియాతో చక్కర్లు కొడుతోన్న లేఖ తాను రాయలేదని స్పష్టంచేశారు బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి. ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సీఈసీకి జోషి లేఖ రాశారు.
120 సీట్లు మించవని లేఖ ?
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 120 సీట్లు మించవని బీజేపీ అగ్రనేత అద్వానీకి జోషి లేఖ రాసినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. అంతేకాదు తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 8 నుంచి 10 సీట్లు కూడా రావని ఆ లేఖలో ఉంది. జోషి పేరుతో వచ్చిన ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో స్పందించిన జోషి .. ఆ లేఖ తాను రాయలేదని .. రాసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీని వీడను
అంతేకాదు జోషిపై పార్టీ వీడాలనే ఒత్తిడి ఉందని పేర్కొంది. బీఎస్పీ, లేదా ఎస్పీల్లో చేరాలని ప్రెషర్ ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. కానీ ఆయన మాత్రం తన సొంత పార్టీ బీజేపీని వీడడానికి సుతారము ఇష్టపడటం లేదని కూడా ప్రస్తావించారు.
అలా తప్పించారు ..?
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సును బీజేపీ పార్లమెంటరీ బోర్డు 75 ఏళ్లకు తగ్గించింది. దీంతో అద్వానీ, జోషి ఈసారి ఎన్నికల బరిలో దిగలేదు. మోదీ, అమిత్ షా ద్వయం తీసుకొన్ని ఈ నిర్ణయంతో వీరిద్దరూ గుర్రుమీద ఉన్నారు. ఇటీవల బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అద్వానీ బ్లాగులో పరోక్షంగా విమర్శులు చేశారు. ఇప్పుడు జోషి పేరుతో లేఖ విడుదలవటం, జోషి ఈసీకి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.