‘జగన్’తో అనుమానం, బాబుకే లేదు, రజినీతో అప్రోచ్: మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రస్తుత రాజకీయాలపై కీలకమైన విషయాలను వెల్లడించారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రస్తుత రాజకీయాలపై కీలకమైన విషయాలను వెల్లడించారు. ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలతోపాటు తమిళనాడు పరిస్థిపైనా ఆయన ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
బాబుకే ఆ ఆలోచన లేదు..
టీడీపీ అధినే చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమతో కలిసుండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భావించడం లేదని మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ మద్దతుతో అనుమానం
ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన కారణంగా టీడీపీ వాళ్లు అనుమానిస్తున్నారని అన్నారు.
టీడీపీతో అంతవరకే..
రాజకీయాలు ఎప్పుడూ ఏడేడు జన్మల బంధంలా ఉండవని, టీడీపీతో తమ బంధమూ అంతేనని మురళీధర్ రావు స్పష్టం చేశారు. రెండు వేర్వేరు పార్టీలుగా ఎవరి లక్ష్యాలు వాళ్లకు ఉన్నాయని, మంచిగా ప్రయాణం సాగి, ఒకరి కారణంగా మరొకరు నష్టపోనంతవరకూ పొత్తు కొనసాగుతుందని తెలిపారు. తెలుగుదేశం కారణంగా ఏపీలో బీజేపీ ఎదగదేమోనన్న ఆందోళన తమకు లేదని స్పష్టం చేశారు.
కొనుగోలు చేయడం లేదు.. కేసీఆర్పై మర్యాదగా
తమ పార్టీ ఎవరినీ కొనుగోలు చేయట్లేదని, మోడీ చరిష్మా చూసి వారంతట వారే వచ్చి బీజేపీలో చేరుతున్నారని మురళీధర్ రావు చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలన, అమలు చేస్తున్న పథకాలపై సుశీల్ కుమార్ పొగడ్తలను ప్రస్తావిస్తూ.. ఆయన అతిథిగా వచ్చి మర్యాదగా ఓ మాటని వెళ్లారని చెప్పారు.
కేసీఆర్పై అమిత్ షానే..
పాలనపై సర్టిఫికెట్ ఇచ్చేది అమిత్ షాయేనని, ఆయన కేసీఆర్ పాలనపై చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి వున్నామని మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్ తమకు బలమైన కోటని, కొన్ని కారణాలవల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవలేదని చెప్పారు.
ఒకప్పుడు కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతోందని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.
రజినీతో చర్చలు..
ఇక రజనీకాంత్ సొంత పార్టీ పెడతారా? లేక బీజేపీతో కలసి నడుస్తారా? అన్న విషయాన్ని ఆయనే తేల్చుకోవాలని మురళీదర్ రావు అన్నారు. తాము మాత్రం ఆయనతో సత్సంబంధాలనే కోరుతున్నామని, ఆయనతో చర్చలు సాగుతున్నాయని చెప్పారు. కాగా, ఇటీవలే మోడీ చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి రజినీకాంత్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోడీకే తన పూర్తి మద్దతంటూ చెప్పారు.