ఫేక్ ప్రొఫైల్తో వల: శైలజను చంపిన మేజర్కు మామూలోడు కాదు, మరో ముగ్గురు మహిళలతోను!
Recommended Video
న్యూఢిల్లీ: సహచర ఆర్మీ మేజర్ సతీమణి శైలజ ద్వివేదిని హత్య చేసిన నిందితుడు నిఖిల్ హండా గురించి సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. న్యాయస్థానం ఆయనను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తోంది.
హంతకుడైన మేజర్కు ఆడవాళ్ల పిచ్చి ఉందని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్స్తో ఆడవారికి వలవేసేవాడని గుర్తించారు. సోషల్ మీడియాలో తన ఫేక్ ప్రొఫైల్ ద్వారా ఆడవారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాడు. నిందితుడు హండాకు, శైలజకు నాగాలాండులో ఉన్నప్పుడు పరిచయమైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
శైలజ-మేజర్ మధ్య ఆర్నెళ్లలో 3500 కాల్స్, అక్కడ్నుంచి వచ్చేసి టచ్లో: వీడియో కాల్లో పట్టేసిన భర్త
ఫేక్ అకౌంట్లో ఢిల్లీ వ్యాపారవేత్తగా
పోలీసుల విచారణలో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వారిద్దరికి పరిచయమైనట్లుగా తేలిందని సమాచారం. పోలీసులు నిందితుడికి చెందిన రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఉండగా, మరో దాంట్లో ఫేక్ అకౌంట్ను పోలీసులు గుర్తించారు. ఫేక్ అకౌంటులో అతను తనను తాను ఢిల్లీకి చెందిన బిజినెస్మెన్గా పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన మరో ముగ్గురితోను మాట్లాడాడు
ఫేక్ అకౌంట్ ద్వారా అతను మహిళలతో మాట్లాడేవాడని కూడా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అతని కాల్ రికార్డ్స్ను పోలీసులు తవ్వితీశారు. దీంతో అతని అసలు రూపం బయటపడింది. శైలజతో పాటు ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు మహిళలతోను అతను ఫోన్లో మాట్లాడేవాడు. ఆ మహిళలు కూడా ఢిల్లీ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.
శైలజ విషయంలో ఏం జరిగిందంటే?
శైలజతో కూడా నిందితుడు హండాకు ఫేక్ అకౌంట్ ద్వారానే పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత ఆరు నెలలకు అతను తన గురించి ఆమెతో అసలు విషయం చెప్పాడు. తాను ఏం చేస్తున్నానో చెప్పేశాడు. ఆ తర్వాత శైలజ, నిందితుడు హండాలు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ట్రాన్సుఫర్ చేసుకొని, భర్తకు పరిచయం చేపించి
నిందితుడు హండా తొలుత శ్రీనగర్లో పోస్టింగ్లో ఉన్నాడు. ఆ తర్వాత మీరట్కు ట్రాన్సుఫర్ అయ్యాడు. అతని కుటుంబం సాకెత్లో ఉంటోంది. తనను నాగాలాండులోని దిమాపూర్కు ట్రాన్సుఫర్ చేయాలని అతను విజ్ఞప్తి చేశాడు. అక్కడే శైలజను నిత్యం కలిసేవాడు. అంతేకాదు, అతనిని తన భర్త అమిత్కు కూడా పరిచయం చేసింది. అతను నిత్యం శైలజ ఇంటికి వచ్చేవాడు.
శైలజ హెచ్చరిక
సమాచారం మేరకు... తనకు దూరంగా ఉండాలని, లేదంటే సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని శైలజ కొంతకాలంగా నిందితుడిని హెచ్చరించింది. ఆ తర్వాత శనివారం (హత్య జరిగిన రోజు) కలుద్దామని అతను చెప్పాడు. తాను ఆమెపై నుంచి కారు పోనిచ్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశానని కూడా పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు.
ఆసుపత్రిలో అమిత్ను చూసి
శైలజను హత్య చేసిన తర్వాత తన బంధువును ఒకరిని ఆసుపత్రి నుంచి తీసుకు వచ్చి సాకేత్లో దించాడు. అతను మళ్లీ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతనిని అమిత్ను (శైలజ భర్త) చూశాడు. అతను మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడి నుంచి వచ్చేశాడు. దీంతో అమిత్.. నిందితుడు హండాకు ఫోన్ చేసి ఇక్కడకు ఎందుకు వచ్చావని అడిగాడు. తన కొడుకుకు చికిత్స కోసం వచ్చానని చెప్పాడు. అమిత్ పోలీసులకు వివరాలు తెలిపాడు. పోలీసులు హండా తల్లిదండ్రులను కలిశారు. అతను ఎక్కడున్నాడో చెప్పమని అడిగారు. ఈ విషయం తెలిసిన నిందితుడు మీరట్ వెళ్లి, అక్కడ ఫోన్ స్విచ్చాప్ చేసుకున్నాడు.