జైలు నుండి దర్జాగా ఖైదీ ఎస్కేప్, దొరకని ఆచూకీ
బెంగళూరు: నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉన్న బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుండి ఖైదీ దర్జాగా తప్పించుకున్నాడు. మంజునాథ్ (33) అనే ఖైదీ తప్పించుకుని పారిపోవడంతో పరప్పన అగ్రహారపోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదని సమాచారం.
శుక్రవారం సాయంత్రం జైలు సిబ్బంది ఖైదీలను లెక్క పెడుతున్న సమయంలో మంజునాథ్ కనపడలేదు. అతని కోసం జైలు మొత్తం గాలించినా ఆచూకి లేదు. చివరికి సీసీ కెమెరాలు పరిశీలించగా మంజునాథ్ విజిటర్ పాస్ ఉపయోగించి జైలు మెయిన్ గేట్ నుండి దర్జాగా బయటకు వెళ్లిన విషయం బయటపడింది.
వెంటనే జైలు సిబ్బంది పై అధికారులకు సమాచారం అందించారు. మంజునాథ్ కు గేట్ పాస్ ఇచ్చింది ఎవరు అని అధికారులు ఆరా తీస్తున్నారు. మంజునాథ్ కు గేట్ పాస్ ఇచ్చింది ఎవరు, అతనికి సాదారణ దుస్తులు అందించింది ఎవరు అని అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
హత్య కేసులో మంజునాథ్ కు యావజ్జీవశిక్ష పడింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఖైదీలను బ్యారికేడ్ల నుండి బయటకు వదిలారు. తరువాత మంజునాథ్ నేరుగా బట్టలు ఇస్త్రీ చేసే గదిలోకి వెళ్లాడు. ఖైదీలు వేసుకునే దుస్తులు తీసి వేసి రంగురంగుల ప్యాంటు, షర్టు వేసుకున్నాడు.
తరువాత జైలు అధికారులు ఉండే గదిలోకి వెళ్లాడు. ఖైదీలను చూడటానికి వెళ్లిన వారి చేతి వేలుకు వేసే ఇంక్ ను అతనే వేసుకున్నాడు. పాస్ తీసుకుని నేరుగా జైలు మెయిన్ గేట్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో జైలు సిబ్బంది అతనిని ప్రశ్నించారు.
తనకు పెరోల్ అవది ఒక వారం విస్తరించాలని అర్జీ సమర్పించడానికి వచ్చానని, మీరే నా చేతికి ఇంక్ వేసి పంపించారని చెప్పాడు. గుడ్డిగా నమ్మిన జైలు సిబ్బంది అతనిని వదిలి పెట్టారు. అక్కడి బయటకు వచ్చిన మంజునాథ్ పరారైనాడు.
గత సంవత్సరం సీరియల్ రేపిస్ట్ సైకో జైశంకర్ ఇదే జైలు నుండి 20 అడుగుల గోడ దూకి పరారైనాడు. తీవ్రగాయాలు కావడంతో ఐదు రోజుల తరువాత జైశంకర్ బెంగళూరు శివార్లలోని ఒక చెరువు సమీపంలో పోలీసులకు పట్టుబడ్డాడు.