రామ్ కుమార్ ది హత్యా? ఆత్మహత్య? : అనుమానాలన్ని పోలీసుల పైనే?
చెన్నై : స్వాతి హత్య కేసులో అసలు నిజాలు వెలుగుచూడక ముందే.. నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడు వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రామ్ కుమార్ ది ఆత్మహత్య అని పోలీసులు చెబుతున్నప్పటికీ.. దీనిపై చాలానే అనుమానాలు వ్యక్తమవుతుండడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మూడు నెలలుగా కొనసాగుతూ వస్తున్న విచారణలో.. రామ్ కుమార్ ఆత్మహత్యతో స్వాతి హత్య కేసు మరో సంచలన మలుపు తిరిగనట్టయింది. ప్రతిపక్షాలతో పాటు కొన్ని ప్రజా సంఘాలు రామ్ కుమార్ ఆత్మహత్య వెనుక నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు అధికారులు, వందలాది ఖైదీలు ఉన్న జైలులో రామ్ కుమార్ ఆత్మహత్యకు ఎలా పాల్పడ్డాడన్నది తెరపైకి వస్తోన్న ప్రశ్న.
అంతమంది సిబ్బంది రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటుంటే.. ఎందుకు అడ్డుపడలేదు? కరెంట్ వైరును కొరికి బలవన్మరణానికి పాల్పడుతుంటే.. సిబ్బంది ఎవరు గమనించలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రామ్ కుమార్ తండ్రి పరమశివం కూడా ఇవే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ కుమారుడిని హత్య చేశారనేది ఆయన ఆరోపణ. కాగా, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించేవరకు రామ్ కుమార్ మృతదేహాన్ని తీసుకుపోయేది లేదని తెగేసి చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. రామ్ కుమార్ ఆత్మహత్యపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. దీంతో ఆత్మహత్యపై పోలీస్ శాఖ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
పోస్ట్ మార్టంపై స్టే.. అత్యవసర విచారణకు తిరస్కరణ :
రామ్ కుమార్ ఆత్మహత్యపై అనుమానాలున్న నేపథ్యంలో.. నిజాలు వెల్లడయ్యే వరకు పోస్ట్ మార్టంకు అనుమతించవద్దని రామ్ కుమార్ తరుపు న్యాయవాదులు రామ్ రాజ్, న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అలాగే కేసును అత్యవసర కేసుగా స్వీకరించాలని కోరారు. కేసుపై స్టే విధించిన కోర్టు అత్యవసర కేసుగా తీసుకోవడం కుదరదని చెప్పింది.
దీంతో.. రామ్ కుమార్ తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు పోస్ట్ మార్టం స్టే కొనసాగనుంది. మరోవైపు రామ్ కుమార్ మృతదేహాన్ని తరలించిన రాయపేట ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి చుట్టూ రామ్ కుమార్ బంధవులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానిదే బాధ్యత కరుణానిధి :
రామ్ కుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి. ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధ్యక్షుడు రాందాస్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత రామ్ కుమార్ ఆత్మహత్య వెనుక ఉన్న నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న పుళల్ జైలు వద్ద సోమవారం నాడు ఆందోళన చేపట్టాయి విపక్షాలు. రామ్ కుమార్ ఆత్మహత్యపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఇక రామ్ కుమార్ సొంతూరు అయిన సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురంలో అతని బంధువులు ఆందోళనకు దిగి మూడు ప్రభుత్వ బస్సులపై దాడికి పాల్పడ్డారు.
న్యాయ విచారణ ప్రారంభం :
రామ్ కుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో.. కోర్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి తమిళ్ సెల్వి రంగంలోకి దిగారు. సోమవారం నాడు ఉదయం 9.20 గం.లకు రాయపేట ఆసుపత్రికి వెళ్లి రామ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించి వైద్యులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
రామ్ కుమార్ ఒంటిపై ఉన్న గాయాల గురించి వైద్యులను ఆరా తీశారు. అనంతరం అక్కడి నుంచి పుళల్ జైలుకు చేరుకుని రామ్ కుమార్ ను ఉందిన జైలు గది, కరెంటు వైరు కొరికిన ప్రాంతాన్ని పరిశీలించి జైలు అధికారుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.