షాకింగ్ : ప్రకాష్ రాజ్ను హత్యచేసేందుకు భారీ కుట్ర
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తోంది. ఎంక్వైరీ సందర్భంగా సిట్కు షాకిచ్చే నిజాలు తెలిశాయి. నటుడు ప్రకాష్ రాజ్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం వెలుగు చూసింది. గౌరీ లంకేష్ను హత్య చేసినవారే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను ఓ ప్రముఖ కన్నడ వార్తా ఛానెల్ ప్రసారం చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలపై బహిరంగ వేదికలపై ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు చేస్తుండటంతో ప్రకాష్ రాజ్ను అంతమొందించేందుకు ఈ గ్యాంగ్ కుట్రపన్నిందని దర్యాప్తులో వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు. ప్రకాష్ రాజ్తో పాటు ప్రముఖ రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్ను కూడా హత్యచేసేందుకు ప్లాన్ చేసిందని పోలీసులు గుర్తించారు.విచారణలో భాగంగా పోలీసులకు ప్రకాష్ రాజ్ ను చంపేయాలన్న పథకం గురించి గౌరీ లంకేష్ హత్య కేసు ప్రధాన నిందితుడు పరశురామ్ వాఘ్మోర్ తెలియజేశాడు. గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ప్రకటనలు చేయడమే దీనికి కారణంగా వాఘ్మోర్ తెలిపాడు.
ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ఈ ఘటనపై స్పందించారు. తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దంటూ ట్వీట్ చేశారు. ప్రతి సమస్యకు చంపడమే సమాధానం కాకూడదని హితవు పలికారు. ఇలాంటి ఆలోచనలు విషపూరితమైనవిగా ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తన గళాన్ని నొక్కేయాలని ప్రయత్నిస్తే అది మరింత బలంగా తయారవుతుందని ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.