పెళ్ళైన ఆర్నెళ్ళకే దారుణం: కోర్టులోనే భార్యను హత్య చేసిన భర్త
భువనేశ్వర్: ప్రేమించి వివాహం చేసుకొన్న భార్యనే కోర్టులోనే దారుణంగా హత్య చేశాడు భర్త, ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఈ దంపతులకు కౌన్సిలింగ్ చేస్తున్న సమయంలోనే భార్య,భర్తల మధ్య గొడవ పెరిగి పెద్దది కావడంతో భార్యపై గొడ్డలితో భర్త దారుణంగా దాడికి పాల్పడ్డాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ జిల్లా సింధూర్పంక్ గ్రామానికి చెందిన రమేష్ కంవార్ ఇదే ప్రాంతానికి ఉపాధి కోసం వలస వచ్చిన సంగీత చౌదరి అనే యువతిని ప్రేమించి ఆరు మాసాల క్రితం వివాహం చేసుకొన్నాడు. అయితే మూడు నెలలుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పెద్దలు వారిద్దరి మధ్య రాజీ చేసేందుకు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఈ తరుణంలో విడాకులు కావాలని సంగీత చౌదరి కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కోర్టు కేసు విషయమై భార్య, భర్తలు కుటుంబసభ్యులతో కలిసి సంబల్పూర్ ఫ్యామిలీ కోర్టుకు సోమవారం నాడు హజరయ్యారు.
ఈ విషయమై కోర్టులో దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ తరుణంలో భార్య, భర్తల మధ్య మాటా మాటా పెరిగింది. సహనం కోల్పోయిన రమేష్ తన వెంట తెచ్చుకొన్న గొడ్డలితో భార్య సంగీత, ఆమె తల్లి లలిత, సోదరి కుమార్తె శివానిలపై దాడి చేశాడు. వెంటనే పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంగీత మృతి చెందింది. మిగిలిన ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.అతడిపై కేసు నమోదు చేశారు.