అగ్రకులం అమ్మాయితో మాట్లాడాడు: ఇంజనీర్ హత్య
చెన్నై: తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కారణంతో ఓ దళిత కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధిని హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
21 ఏళ్ల గోకుల్ రాజ్ నమక్కల్ జిల్లాలోని ఓ గ్రామంలోని దళిత కుటుంబానికి చెందిన వాడు. తమ కూతురితో మాట్లాడుతున్నాడని స్ధానిక నేత యువరాజ్ అనే వ్యక్తి గోకుల్ రాజ్ను కిడ్నాప్ చేశాడు. అనంతరం అతడిని హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఊరికి దగ్గరలో ఉన్న రైలు పట్టాలపై పడేశాడు.
ప్రేమ విఫలం కావడం వల్లే తాను రైలు కింద పడి చనిపోయానని అతడి జేబులో లభించిన లేఖ ఆధారంగా పోలీసులు తెలిపారు. దీంతో స్ధానిక నేతపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
రైలు పట్టాల వద్ద దొరికిన మృతదేహానికి పోస్టు మార్టం శుక్రవారం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణను కొనసాగిస్తామని పోలీసులు అంటున్నారు. అయితే గోకుల్ రాజ్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిని కిడ్నాప్ చేసి మరీ హతమార్చి రైలుపట్టాలపై పడేసినట్లు ఆరోపిస్తున్నారు.
తమిళనాడులో ఇలాంటి హత్యలు సర్వసాధారణమయ్యాయి. 2013లో ధర్మపురి జిల్లాలో ఇళవరసన్ అనే దళిత కుటుంబానికి చెందిన యువకుడుని ఇలాగే హత్య చేసి రైలు పట్టాలపై పడేశారు. అప్పట్లో ఈ హత్య తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.