కూరలో కారం ఎక్కువైందని భార్యను చంపేసిన భర్త..
కూరలో కారం ఎక్కువైందన్న కారణంతో తీవ్ర ఆగ్రహావేశంతో ఊగిపోయిన ఓ భర్త భార్యను కర్రతో బాది చంపాడు.
న్యూఢిల్లీ: కూరలో కారం ఎక్కువైందన్న కారణంతో తీవ్ర ఆగ్రహావేశంతో ఊగిపోయిన ఓ భర్త భార్యను కర్రతో బాది చంపాడు. ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. చనిపోయిన మహిళ శరీరంపై 22చోట్ల గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్లంబర్ గా పనిచేస్తున్న సుబోధ్ అనే వ్యక్తి తన భార్య మనీషాకు తెలియకుండా మునియా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉండటంతో ఆ తర్వాత అవి మరింత ముదిరాయి. దీంతో మనీషా రోహిణిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.
కొద్దిరోజుల తర్వాత ఈ నెల 10న సుబోధ్ ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే మునియా కూడా అక్కడికి రావడం.. భర్తతో కలిసి ఉండటాన్ని మనీషా సహించలేకపోయింది. ఇదేంటని నిలదీసింది. దీంతో ఆమెను బుజ్జగించి మునియాను వేరే ఇంట్లో ఉంచుతానని చెప్పాడు.
మునియా వెళ్లిపోయిన తర్వాత మనీషా భోజనం సిద్దం చేసింది. తినే సమయంలో కూరలో కారం ఎక్కువైందని సుబోధ్ మండిపడ్డాడు. అక్కడితో ఆగక ఓ కర్ర తీసుకుని ఆమెను చావబాదాడు. తీవ్రంగా గాయపడ్డ మనీషా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.