లాబీయింగ్: రాష్ట్రపతి రేసులో మురళీ మనోహర్ జోషి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం వచ్చే ఏడాదితో ముగియనుండటంతో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు రాష్ట్రపతి అవుతారన్న అంశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆ పదవి కోసం కొందరు బిజెపి సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా, రాష్ట్రపతి పదవి రేసులో మరో బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేరు కూడా చేరింది. ఇప్పటికే ఆయన ఈ పదవి కోసం ఆర్ఎస్ఎస్, బిజెపి అగ్రనాయకులతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం.
జోషి ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు బిజెపి సీనియర్ నేతల్ని, సంఘ్ కీలక నేతల్ని కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రపతి పదవి గురించి ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంఘ్ నిర్ణయం సైతం కీలక పాత్ర పోషించనుంది. వారి నిర్ణయం ప్రకారమే ప్రధాని మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్షాలు కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ నేత దేవేంద్ర స్వరూప్.. జోషీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ నూతన ఛైర్మన్ రామ్ బహదూర్ రాయ్ కూడా జోషికి మద్దతు ప్రకటించారు.