సెల్ఫీలు తీసుకుంటూ అలలకు కొట్టుకుపోయారు, 14మంది మృతి
ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని మురుద్ - జంజీరా తీరంలో సోమవారం సముద్రంలో మునిగి 14 మంది విద్యార్థులు మృతి చెందిన విషాదకర జరిగింది. ఈ విషాధ ఘటనకు ఫోటోలు, సెల్ఫీలు కారణమని తెలుస్తోంది.
తమ స్నేహితులు సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా కెరటాలు ఎగసిపడటంతో కొట్టుకుపోయారని ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థిని తెలిపింది. పెద్ద కెరటాలు సముద్రంలోకి వారిని లాక్కుపోయాయని చెప్పింది. వీరిని రక్షించేందుకు పలువురు సముద్రంలోకి దూకారని చెప్పింది.
వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఎడ్ల బండ్లు, గుర్రపు బళ్లలో వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది. దేవుడి దయతో తాను, తన స్నేహితురాలు ప్రాణాలతో బయటపడ్డామంది. తనను బతికించినందుకు దేవుడికి ధన్యవాదాలు అంది.
ఆమె మాట్లాడుతూ... 'నేను చాలా అదృష్టవంతురాలిని ప్రమాదం నుంచి బయటపడి కలిగాను. ఇది చాలా విషాదకరమైన విహారయాత్ర. నన్ను నా స్నేహితులను రక్షించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మేము బీచ్కు చేరుకున్నాము.
అందరం సరదాగా ఆడుకుంటున్నాం. అధ్యాపకులు వద్దని ఎంత వారించినప్పటికీ కొందరు స్నేహితులు సముద్రంలోకి దిగి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో పెద్ద అలలు రావడంతో ఆ తాకిడికి విద్యార్థులు అందరూ మునిగిపోయారు. వారిని కాపాడటానికి మరికొందరు ప్రయత్నించగా లాభం లేకపోయింద'ని చెప్పింది.
సోమవారం సాయంత్రం మురుది బీచ్లో విహారయాత్రకు వెళ్లిన 116 మంది విద్యార్థుల్లో 14 మంది విద్యార్థులు సముద్రంలో మునిగిపోయి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఓబేద్ ఇనాందార్ కళాశాల ప్రిన్సిపాల్ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.