రాజ్యసభకు పీటీ ఉష, ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, హెగ్డే: ప్రధాని మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ రాజ్యసభ సభ్యులను కేంద్రం ప్రకటించింది. ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజా, మాజీ ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ పీటీ ఉషలను రాష్ట్రపతి బుధవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. వారికి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video
రాజ్యసభకు ఇళయరాజా: స్ఫూర్తిదాయకమంటూ ప్రధాని మోడీ
ఇళయరాజా గురించి ప్రధాని మోడీ ఇలా అన్నారు.. " మేధావి ఇళయరాజా జీ సృజనాత్మక తరతరాలుగా ప్రజలను ఆకర్షించింది. అతని రచనలు అనేక భావోద్వేగాలను అందంగా ప్రతిబింబిస్తాయి. అతని జీవిత ప్రయాణం కూడా అంతే స్ఫూర్తిదాయకం- అతను వినయ నేపధ్యం నుంచి ఎదిగి చాలా సాధించారు. ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారనే విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాను' అని మోడీ వ్యాఖ్యానించారు.
రాజ్యసభకు పీటీ ఉష: మార్గదర్శకమంటూ మోడీ ప్రశంస
పీటీ ఉషపై ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. "ప్రత్యేకమైన పీటీ ఉషా జీ ప్రతి భారతీయుడికి ఒక ప్రేరణ. క్రీడలలో ఆమె సాధించిన విజయాలు విస్తృతంగా తెలిసినప్పటికీ, గత కొన్నేళ్లుగా వర్ధమాన క్రీడాకారులకు మార్గదర్శకత్వం వహించడానికి ఆమె చేసిన కృషి కూడా అంతే ప్రశంసనీయం. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆమెకు అభినందనలు' అని మోడీ పేర్కొన్నారు.
రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్: ప్రపంచవ్యాప్త ముద్రంటూ మోడీ
చిత్రనిర్మాత వి విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశం అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేశాయని ప్రధాని మోడీ అన్నారు.' వి విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన రచనలు భారతదేశ మహిమాన్వితమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేశాయి. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వీ విజయేంద్ర ప్రసాద్.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి.
రాజ్యసభకు వీరేంద్ర హెగ్డే: సేవలపై కొనియాడిన మోడీ
విశిష్టమైన సమాజ సేవలో ఆయన ముందున్నారని వీరేంద్ర హెగ్గడేపై ప్రధాని మోడీ ప్రశంసలు గుప్పించారు. "ధర్మస్థల ఆలయంలో ప్రార్థనలు చేసే అవకాశం నాకు లభించింది. ఆరోగ్యం, విద్య, సంస్కృతిలో ఆయన చేస్తున్న గొప్ప పనిని కూడా చూసే అవకాశం ఉంది. అతను ఖచ్చితంగా పార్లమెంటు కార్యకలాపాలను సుసంపన్నం చేస్తారు' అని ప్రధాన మంత్రి మోడీ అన్నారు.కాగా, రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు కూడా దక్షిణాదికి చెందినవారే కావడం గమనార్హం. దీంతో బీజేపీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దక్షిణాదిని టార్గెట్ చేసిన బీజేపీ.. అందుకే రాజ్యసభ పట్టం
కాగా, రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు కూడా దక్షిణాదికి చెందినవారే కావడం గమనార్హం. దీంతో బీజేపీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సినీ దర్శక, నిర్మాత విజయేంద్ర ప్రసాద్, కేరళ నుంచి పరుగుల రాణి పీటీ ఉష, తమిళనాడు నుంచి సంగీత దర్శకుడు ఇళయరాజా, కర్ణాటక నుంచి ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు ఎంపిక చేసింది. కాగా, విజయేంద్ర ప్రసాద్ గురించి తెలుగులోనే ప్రధాని మోడీ ట్వీట్ చేయడం గమనార్హం. మిగితావారిని కూడా ఆయా రాష్ట్రాల భాషలో కీర్తించారు.