సంగీత ప్రపంచంలో పెనువిషాదం - ‘పద్మవిభూషణ్’ పండిట్ జస్రాజ్ ఇకలేరు - ప్రధాని మోదీ సంతాపం
తన గానమాధుర్యంతో 80 ఏళ్లపాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్, 'పద్మవిభూషణ్' పండిట్ జస్రాజ్ ఇకలేరన్న వార్త సంగీత ప్రపంచంలో పెను విషాదాన్ని నింపింది. 90ఏళ్ల జస్రాజ్ సోమవారం తెల్లవారుజామున అమెరికాలోని న్యూజెర్సీలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.
పదేళ్ల వయసు నుంచే కచేరీలు ప్రారంభించిన జస్రాజ్ అనతికాలంలోనే శాస్త్రీయ సంగీతంలో విద్వాన్ గా పేరు సాధించారు. అంతర్జాతీయంగానూ కీర్తి గడించిన ఆయన.. సంప్రదాయ రాగాలను అసాధారణ రీతిలో పలికించి శ్రోతల అభిమానాన్ని చురగొన్నారు. అనేకానేక అంతర్జాతీయ అవార్డులతోపాటు, భారత్ లో రెండో అత్యున్నత పౌరపురస్కారం 'పద్మవిభూషణ్'ను కూడా పొందారు.
వెనక్కి తగ్గని హీరో రామ్ పోతినేని - మరింత గట్టిగా ఎదురుదాడి - ఈసారి కులం పేరుతోనే
పండిత్ జస్రాజ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పండిట్ మరణం దురదృష్టకరమని, భారత సాంస్కృతిక రంగంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని ప్రధాని అన్నారు. అత్యుత్తమ ప్రదర్శనలతోపాటు అద్భుతమైన శిశ్యులను కూడా తయారు చేసిన ఘనత జస్రాజ్ కు దక్కుతుందని, ఆయన ఆత్మకు శాంతి, కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
Recommended Video
1930 జనవరి 28న అవిభాజ్య పంజాబ్(ఇప్పటి హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లా)లోని పిలౌరీలో జస్రాజ్ జన్మించారు. తన పదో ఏట నుంచే కచేరీలు ప్రారంభించారాయన. అనతికాలంలోనే భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఔపోసనపట్టిన ఆయన, మేఘావతి ఘరానా విభాగంలో దిట్టగా పేరుతెచ్చుకున్నారు. క్లాసికల్, సెమీ క్లాసికల్ కచేరీలు ఆల్బమ్స్ రూపంలోనూ వచ్చాయి. ఆయన సంగీతాన్ని సినిమాల్లోనూ ట్రాక్లుగా వాడుకున్నారు. ఇండియా సహా కెనడా, అమెరికాలో అనేక మందికి సంగీతంలో శిక్షణ ఇచ్చారు. చాలా కాలంగా న్యూజెర్సీలో కూతురుతు దగ్గరే ఉంటోన్న జస్రాజ్ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మధురా శాంతారామ్, కొడుకు సారంగ్ దేవ్ పండిట్(బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్), కూతురు దుర్గా జస్రాజ్ ఉన్నారు.