Must watch:పురి విప్పిన నీటి తెమ్మెర... మ్యూజిక్కు అనుగుణంగా నాట్యం చేస్తూ..!
నోయిడా: సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. అందులోను భారతీయ సంస్కృతి ఉట్టిపడే మన సంగీతం అంటే ప్రపంచ దేశాల్లోని ప్రజలు సైతం ఇష్టపడుతారు. సంగీతం మానసిక రుగ్మతలను మాయం చేస్తుందంటారు. ఆహ్లాదకరమైన సంగీతం ఆరోగ్యానికి మంచిదని కూడా పెద్దలు చెబుతుంటారు. అలాంటి మ్యాజిక్ను ప్రేమించని వారెవరుంటారు చెప్పండి. సాధారణంగా మంచి మ్యూజిక్కు మనుషులు నాట్యం వేయడం చూసి ఉంటాం. వర్షం పడినప్పుడు నెమలి కూడా నాట్యం వేస్తుంది. అంటే ప్రకృతినే సంగీతంగా భావించి మయూరం తన పింఛాన్ని పురి విప్పి నాట్యం చేస్తుంది. ఇక సంగీతానికి నీళ్లు నాట్యం చేస్తే ఎలా ఉంటుంది..? ఆ ఊహనే మనసుకు ఎంతో హాయినిస్తుంది. అలాంటి మ్యాజికల్ ఫౌంటెన్ తొలిసారిగా నోయిడాలో ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రారంభమైన మ్యూజికల్ ఫౌంటెయిన్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో సోమవారం ఓ అద్భుతమైన మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభం అయ్యింది. మంగళవారం నుంచి ఇది ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి రుసుము లేదు కానీ కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు. మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మంచి ఆహ్లాదకరమైన సంగీతానికి నీరు జిమ్ముతూ నాట్యం చేసేందుకు సిద్దంగా ఉంది.
సంగీతం ద్వారా సందేశం
సెక్టార్ 91లో ఉన్న మెడిసినల్ పార్కుల్లో ఈ మ్యాజికల్ ఫౌంటెన్ను ఏర్పాటు చేశారు. సంగీతం ద్వారా ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ మంచి సందేశంను ఇవ్వనున్నట్లు జనరల్ మేనేజర్ రాజీవ్ త్యాగి చెప్పారు. సోమవారం రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయుర్వేదపై ప్రదర్శన జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన వారు లేజర్ షో ద్వారా దేశభక్తి గీతాలను విన్నారు. ప్రతి రోజు దేశభక్తి గీతాలు, కొందరు లెజండరీ వ్యక్తుల జీవిత విశేషాలు, అంటే కళలు, చరిత్ర, ఆరోగ్యం, రాజకీయ రంగం, సామాజిక సేవల రంగాల్లో కీలక పాత్ర పోషించిన వారి గురించి లేజర్ షోలో ప్రదర్శనలు ఇస్తామని త్యాగి చెప్పారు.
మ్యూజికల్ ఫౌంటెయిన్కు ఖర్చు ఎంతంటే..
నోయిడా - గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేకు సమీపంలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఈ బయోడైవర్శిటీ పార్కు ఉంది. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్న ఈ పార్కు పూర్తయితే నోయిడాలోనే అతి పెద్ద పార్కుగా అవతరించనుంది. ఇక్కడ దాదాపుగా 4322 చెట్లను అధికారులు నాటారు. ఇందులో వేప చెట్టు, జామూన్ చెట్లు, మర్రి చెట్లు, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇక పార్కులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మ్యూజికల్ ఫౌంటెన్ కోసం అధికారులు రూ.4.4 కోట్లు మేరా ఖర్చు చేశారు. ప్రతి రోజు మ్యూజిక్ మరియు సౌండ్ షోలను ఇక్కడ ప్రదర్శిస్తారు.
మనసుకు ఆహ్లాదం
ఇలాంటి ఒక గొప్ప పార్కు తన నియోజకవర్గంలో ఉండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు నోయిడా ఎమ్మెల్యే పంకజ్ సింగ్. సాధారణంగా ఇలాంటి పార్కులు సింగపూర్, లేదా దుబాయ్లలో ఉంటాయని చెప్పిన ఆయన దేశ నలుమూలల నుంచి నోయిడాకు వచ్చి సెటిల్ అయిన వారికి ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ఒక మంచి అనుభూతిని ఇస్తుందని అన్నారు. నోయిడా నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందంటే ఇందుకు కారణం ఇలాంటి పార్కులు రావడమే అని చెప్పారు. ఇక ఇంతటి చక్కటి పార్కును నోయిడా అధికారులు తీసుకొచ్చినందుకు వారిని అభినందించారు బీజేపీ ఎంపీ డాక్టర్ మహేష్ శర్మ. భవిష్యత్తులో ఇతర నగరాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ మమేష్ శర్మ చెప్పారు.