ముస్లింలపై పెరుగుతున్న దాడులు: జైశ్రీరాం ఉచ్చరించనందుకు కుర్రాడిపై దాడి
కాన్పూర్ : మొన్న అన్సారీ...నిన్న క్యాబ్ డ్రైవర్.. నేడు ఓ పదహారేళ్ల కుర్రాడు. మనుషులు వేరైనా వారిపై దాడులకు కారణం మాత్రం కామన్గా ఉంది. వారు ముస్లింలు కావడం వారు జైశ్రీరాం అని ఉచ్చరించాల్సి ఉండటం. ఇక అసలు విషయం చూస్తే... 16 ఏళ్ల ముస్లిం అబ్బాయి జైశ్రీరాం అని ఉచ్చరించనందుకు కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ అబ్బాయిని చితకబాదారు. అంతేకాదు ముస్లింలు వారి మతాచారం ప్రకారం ధరించే టోపీ వేసుకోవడంతో అబ్బాయిని కొట్టిన దుండగులు ఆ తర్వాత జైశ్రీరాం అనాల్సిందిగా బలవంతం పెట్టారు.
కాన్పూర్లోని బర్రా ప్రాంతంలో నివసించే మొహ్మద్ తాజ్ అనే అబ్బాయి కిద్వాయ్ నగర్లో నమాజ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారు సైకిలుపై వచ్చి తాజ్ను అడ్డుకున్నారు. తాను ధరించిన టోపీని తీసివేయాల్సిందిగా ఆ దుండగులు బలవంతం చేశారని బర్రా పోలీస్ స్టేషన్ ఎస్సై సతీష్ కుమార్ సింగ్ తెలిపారు. తాను ధరించిన టోపీ తీయకపోవడంతో తనపై దాడి చేసి తనను కిందకు పడేశారని ఆ తర్వాత జైశ్రీరాం అని ఉచ్చరించమన్నారని బాధితుడు తాజ్ చెప్పాడు. అంతేకాదు ఆ ప్రాంతంలో ఉండాలంటే ఈ టోపీలు ధరించరాదని దుండగులు హెచ్చరించినట్లు తాజ్ చెప్పాడు.
Recommended Video
ఆ దుండగులు అతనిపై దాడి చేస్తున్న సమయంలో ఎవరైనా సహాయం చేయాల్సిందిగా అర్థించినట్లు తాజ్ చెప్పాడు. పక్కనే ఉన్న దుకాణాదారుల దగ్గరకు వెళ్లి తనను కాపాడాల్సిందిగా అర్థించినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక దారిన వెళ్లే వారు కొందరు తనను కాపాడేందుకు రావడంతో అక్కడి నుంచి దుండగులు పారిపోయారని చెప్పాడు. భారత శిక్షాస్మృతి ప్రకారం దుండగులపై సెక్షన్ 153ఏ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొహ్మద్ తాజ్ను చికిత్స కోసం హాస్పిటల్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.