వెల్లివిరిసిన భారతీయం: ఈ దృశ్యం చూస్తే కన్నీరు ఆగదిక..!
న్యూఢిల్లీ: కరోనావైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఏ పాపం తెలియని అమాయకులను అన్యాయంగా పొట్టనబెట్టుకుంటున్న వ్యాధి. ఎక్కడో చైనాలో పుట్టి 200కు పైగా దేశాలను కబళించి వేసిన రక్కసి. ఒక మనిషి నుంచి మరో మనిషిని వేరు చేసిన మాయదారి రోగం. స్నేహితులను దూరం చేసిన మహమ్మారి. కుటుంబ సభ్యులు బంధువులు కలవకుండా అట్టే దూరం పెట్టిన వ్యాధి. దేశ ఆర్థిక వ్యవస్థలనే కుప్పకూల్చిన రాకాసి.
చివరకు నా అనుకున్న వారు మరణిస్తే కనీసం కడచూపు కూడా లేకుండా చేసిన మహమ్మారి కరోనావైరస్. ఈ వైరస్ తీసుకొచ్చిన విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే దీన్నుంచి విముక్తి పొందలేము. ఈ మహమ్మారి సృష్టించిన బీభత్సానికి దేశాలు కూడా లాక్డౌన్ స్థితిలోకి వెళ్లిపోయాయి. ఫలితంగా అవసరానికి కావాల్సినవేవీ దొరకడం లేదు. చివరకు ఒక మనిషి మృతి చెందితే అంత్యక్రియలపై కూడా ఆంక్షలు విధించాల్సిన దుస్థితి తలెత్తింది.
అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం అబ్బాయిలు
కరోనావైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్కు పేద ధనిక, కులమతాలు అనే బేధం లేదు. ఎవరిపైనైనా దాడి చేసేయగల సామర్థ్యం ఉంది. ఇక కరోనావైరస్ ధాటికి దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ప్రజలు ఒక్కింత ఇబ్బందులు పడుతున్నారు. వీటికి సంబంధించిన వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే ఒక వ్యక్తి మృతి చెందితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కష్టతరంగా మారుతోంది. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ సంఘటన చోటుచేసుకుంది. హిందూ మతానికి చెందిన మహిళ మృతి చెందితే పొరిగింట్లో ఉంటున్న ముస్లిం యువకులు ఆమె పాడెను స్మశాన వాటిక వరకు మోశారు.
మృతదేహాన్ని మోసుకెళ్లిన ముస్లిం యువకులు
మహిళ మృతి చెందితే ఆమెను చివరి సారిగా చూసేందుకు బంధువులు రాలేదు. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేసిన సూచనల మేరకు ఎవరూ రాలేదు. అయితే మృతురాలి కొడుకు ఒంటరివాడయ్యాడు. ఏమి చేయాలో పాలుపోలేదు. లాక్డౌన్ సందర్భంగా వాహనాలు కూడా లేవు. మరి మృతదేహాన్ని స్మశానవాటికకు చేర్చేదెలా అని ఆవేదన చెందాడు. ఇది గమనించిన పొరిగింటి ముస్లిం యువకులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ఆ అబ్బాయిలో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. మృతదేహాన్ని పాడెపై ఉంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశాన వాటిక వరకు మోసుకెళ్లారు. అంతేకాదు పూర్తి స్థాయిలో పద్ధతి ప్రకారం జరగాల్సిన అంత్యక్రియలు జరిగేలా చూశారు. ఇదిలా ఉంటే తమ చిన్నప్పటి నుంచే మృతురాలు తమకు తెలుసునని చెప్పారు ముస్లిం యువకులు. ఇది తమ బాధ్యతగా భావించి అంత్యక్రియలు పూర్తిచేశామని చెప్పారు.
సోదరభావంకు ఇదే నిదర్శనం: కమల్ నాథ్
ఇక ముస్లిం యువకులు హిందూ మతానికి చెందిన మహిళ మృతదేహాన్ని భుజాలపై మోసుకెళుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ప్రముఖులు స్పందించారు. సమాజానికి ఈ ముస్లిం యువకులు ఆదర్శంగా నిలిచారని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ప్రశంసించారు. ఈ దృశ్యం గంగా జముని సంస్కృతిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు సోదరభావంతో భారతీయులు ఎలా ఉంటారనేది తెలుపుతుందని చెప్పారు.
Recommended Video