జైశ్రీరాం అని పలకనందుకు ముస్లిం క్యాబ్ డ్రైవర్పై దాడి చేసిన దుండగులు
మహారాష్ట్ర: దేశంలో కొందరు హిందూ అతివాదులు పేట్రేగిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం దొంగతనం చేశాడన్న ఆరోపణలపై అన్సారీ అనే వ్యక్తిని చితకబాది జైశ్రీరాం అని పలకాల్సిందిగా బలవంతం పెట్టారు. సామూహిక దాడి చేయడంతో అన్సారీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. మహారాష్ట్రలో ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన క్యాబ్ డ్రైవర్ను జైశ్రీరాం అనాల్సిందిగా కొందరు బలవంతం చేశారు. క్యాబ్ డ్రైవర్ చెప్పకపోవడంతో అతన్ని చితకబాదారు.
ఫైజల్ అనే వ్యక్తి క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.శనివారం రాత్రి దీవా టౌన్కు కొందరు ప్రయాణికులను తీసుకెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో ఐదుగురు తనతో వాగ్వాదానికి దిగినట్లు ఫైజల్ చెప్పాడు. వారు మద్యం సేవించి మరోలోకంలో ఉన్నారని చెప్పారు. ఐదుగురు కలిసి తనపై దాడి చేసినట్లు ఫైజల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక వాగ్వాదానికి దిగిన సమయంలో ఫైజల్ ముస్లిం అని తెలుసుకున్నవారు జైశ్రీరాం అనాల్సిందిగా బలవంతం పెట్టారు. అయితే ఫైజల్ చెప్పకపోవడంతో దాడి చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మత విశ్వాసాలను అతిక్రమించాలని బలవంతంపెట్టినందుకుగాను ఐపీసీ సెక్షన్ 295, లూటీకి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 392 కింద ముంబ్ర పోలీసులు కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఎస్ఎస్ బుర్సే తెలిపారు.