మతసామరస్యం: అయోధ్య ఆలయ నిర్మాణంకు భారీ విరాళం ఇచ్చిన ముస్లిం ఫోరం
గౌహతి: అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పదంగా మారిన భూమిని మొత్తాన్ని రామలల్లాకే చెందుతుందంటూ చెప్పి అదే సమయంలో ముస్లింలకు అయోధ్యలో ఐదెకరాల భూమిని కేటాయించాలని వెల్లడించింది.
తీర్పును ఇటు హిందూ వర్గాలు, అటు ముస్లిం వర్గాలు శిరసా వహించాయి. అయితే దేశంలో మతసామరస్యతను చాటుతూ అస్సాంకు చెందిన 21 ముస్లిం సంస్థలు రామమందిరం నిర్మాణంకు రూ.5లక్షలు విరాళంగా ఇచ్చాయి.
జనగుస్తియా సమ్మోన పరిషద్ అనే ముస్లిం సమాఖ్య రామమందిరం నిర్మాణంకు విరాళంగా రూ.5లక్షలు ప్రకటించింది. అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఫోరం వెల్లడించింది. ఇందులో భాగంగానే రామమందిర నిర్మాణంకు తమ సమాఖ్య తరపున భారీ విరాళం ఇస్తున్నట్లు తెలిపారు అస్సాం మైనార్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మెన్ మోమినుల్ అవాల్.
ఇదిలా ఉంటే జనగుస్తియా సమ్మోన పరిషద్ సమాఖ్యలో గారియా, మారియా, దేశీ, జల్హ, మైమల్, కచారి ముస్లిం వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలకు చెందిన పూర్వీకులు ముస్లిం మతాన్ని స్వీకరించారు. ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అనే మైనార్టీ పార్టీ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ చెప్పారు.
తీర్పు ప్రజల తీర్పుగా భావించాలని చెబుతూ సోషల్ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని పిలుపునిచ్చారు. అదేసమయంలో శాంతిని పాటించాలని బద్రుద్దీన్ చెప్పారు.