కేరళ ముస్లీం ఉదారత: ఉచితంగా శివాలయం కోసం చెరువు, భక్తుల కోసం దారీ ఇచ్చాడు
తిరువనంతపురం: కేరళ మలప్పురం జిల్లాలోని కళికావులో 45 ఏళ్ల ఓ ముస్లీం వ్యక్తి స్థానిక శివాలయానికి ఓ తటాకాన్ని బహుమతిగా ఇచ్చారు. అతని పేరు నంబియార్తోడి అలీ. శతాబ్దాల చరిత్ర కలిగిన కుందాడ శివాలయానికి దానిని ఉదారంగా ఇచ్చారు.
ఆయన భూమి శివాలయం సమీపంలో ఉంది. ఆయన భూమిలో ఓ చెరువు ఉంది. శివాలయ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సభ్యులు ఆ చెరువును కొనుగోలు చేయాలనుకున్నారు. ఈ మేరకు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం కొనేందుకు ఆయనను సంప్రదించారు.
శివాలయానికి తటాకాన్ని బహుమతిగా ఇచ్చిన ముస్లీం
అయితే, నంబియార్తోడి అలీ మత్రం తన భూమిని శివాలయం కోసం అమ్మేందుకు బదులు, హిందూ సోదరుల కోసం ఉచితంగా ఆలయానికి ఇస్తానని చెప్పారు. హిందూ ఆలయం కోసం సదరు ముస్లీం వ్యక్తి ఉచితంగా తటాకాన్ని ఇవ్వడంతో అందరూ అతనిని ప్రశంసిస్తున్నారు.
హిందూ ఆలయాల్లో తటాకం ఉండాలి అందుకే
దీనిపై నంబియార్ తోడి అలీ మాట్లాడుతూ... 'హిందువుల ఆచారం ప్రకారం ఆలయాల్లో తటాకం ఉండాలి. ఆలయ సమీపంలో అలాంటిది లేదు. దీని కోసం ఆలయ కమిటీ తనకు డబ్బులు ఇస్తామని, అమ్మమని అడిగింది. అయితే ప్రజల కోసం వారు అడిగారు కాబట్టి తాను ఉచితంగానే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అదేం పెద్ద విషయం కాదు' అని నంబియార్ తోడి అలీ చెప్పారు.
4.7 సెట్ల తటాకం ఇచ్చారు
నంబియార్ తోడి అలీ ఆలయం కోసం ఇచ్చిన తటాకం 4.7 సెంట్లుగా ఉన్నట్లు అధికారులు తేల్చారని నంబియార్ తోడి అలీ చెప్పారు. ఆలయం కోసం చెరువును ఇచ్చిన నంబియార్ తోడి అలీ భక్తుల కోసం మరో ఉదారత కూడా చాటుకున్నారు.
భక్తుల కోసం తన భూమిలో నడిచేందుకు వెసులుబాటు
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైతే తన భూమిలో గుడి నుంచి తటాకం వరకు దారిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. ఈమేరకు త్వరలో రిజిస్ట్రేషన్ కానుంది.