ముస్లిం మైనర్ల పెళ్లి వారిష్టం- పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు
దేశంలో ముస్లిం యువతుల పెళ్లిళ్ల విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ దేశంలో మైనార్టీ తీరిన యువతీ యువకులు మాత్రమే పెళ్లి చేసుకునే హక్కు ఉండగా.. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం యువతులకు ప్రత్యేక మైన హక్కు ఉందని హైకోర్టు తన తీర్పులో తెలిపింది.
ముస్లిం పర్సనల్ లా లోని ఆర్టికల్ 195 ప్రకారం, యుక్త వయస్సు సాధించని మతి స్ధిమితం లేని వారు, మైనర్లను వారి సంరక్షకులు వివాహం చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా యుక్త వయస్సు వచ్చిన వారు తమ ప్రమేయం లేకుండా ఇతరుల ప్రమేయంతో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పులో పేర్కొంది. అంటే ముస్లిం పర్సనల్ లా ప్రకరారం యుక్త వయసు వచ్చిన వారు తాము ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఒక్కోసారి యుక్త వయస్సు అంటే 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా సాక్ష్యాలు లేకుంటే యుక్త వయ్సుగానే భావించవచ్చని కోర్టు తెలిపింది. పంజాబ్కు చెందిన ముస్లిం దంపతులు తమ 17 ఏళ్ల కుమార్తె 36 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుందని, దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ అల్కా శరీన్ తమ బంధువులు వ్యతిరేకిస్తున్నారనే కారణంతో వీరిద్దరి పెళ్లి చట్ట విరుద్దం కాదని ప్రకటించింది. బంధువుల వ్యతిరేకత వల్ల వారికి రాజ్యాంగ పరంగా లభించిన హక్కులకు భంగం కలగదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. అలాగే ఈ జంటకు భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.