5 ఎకరాలు కాదు 500 ఎకరాలు కూడా వద్దు.. అయోధ్య భూమిపై జిలానీ.. నేడు లా బోర్డు భేటీలో నిర్ణయం..
అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును సవాల్ చేయబోతున్నాని వారి తరఫు లాయర్ జఫర్యబ్ జిలానీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదివారం లక్నోలో సమావేశమవుతోంది. అయోధ్య తీర్పుపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
రివ్యు వేయాలా...? వద్దా.
సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ వేయాలా? వద్దా? వేస్తే ఎక్కడ వేయాలనే అంశంపై చర్చించనుంది. మరోవైపు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ లాయర్ జఫర్యబ్ మరో సమావేశం నిర్వహిస్తున్నారు. ముస్లిం సామాజిక వర్గం వేసిన వ్యాజ్యాల గురించి వారు డిస్కస్ చేస్తారు. అయోధ్యలో వివాదాస్పద భూమికి సంబంధించి శనివారమే తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలుస్తోంది.
సమావేశంలో నిర్ణయం
లక్నోలోని నవ్దా కాలేజీ ప్రాంగణంలో ముస్లిం పర్సనల్ బోర్డు సమావేశం జరుగుతుందని జిలానీ తెలిపారు. అయోధ్య తీర్పుకు సంబంధించి రివ్యూ పిటిషన్పైనే చర్చ ఉంటుందని తెలిపారు. దీంతోపాటు అయోధ్యలో మరో చోట ఐదెకరాల భూమిని ఇవ్వడాన్ని ముస్లిం సమాజం అంగీకరిస్తోందా అనే అంశంపై కూడా సమాలోచనలు జరుపుతామని పేర్కొన్నారు. సమావేశంలో రివ్యూ పిటిషన్ వేయాలని అభిప్రాయం వ్యక్తమైతే.. తప్పనిసరిగా రివ్యూ వేస్తామని తెలిపారు.
అసంతృప్తి
అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పు తమకు అంసతృప్తిని మిగిల్చిందని జిలానీ పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన తెలిపారు. అయితే ఇతరులు, పర్సనల్ లా బోర్డు కూడా ఇతర చోట భూమిని తీసుకొనేందుకు అంగీకరించబోరని తెలిపారు.
500 ఎకరాలు కూడా వద్దు
ఐదెకరాలు కాదు 500 ఎకరాల భూమి ఇచ్చిన తీసుకోబోరని స్పష్టంచేశారు. కానీ అంతిమ నిర్ణయం సమావేశంలో మాత్రం జరుగుతుందని తెలిపారు. మసీదు స్థలం తిరిగి కావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ లాయర్లు మద్దతు ప్రకటించారు.