అత్యుత్తమ తీర్పు: నాడు సున్నీ..నేడు షియా: రామమందిరం నిర్మాణానికి ముస్లిం నేతల విరాళం
లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ముస్లింలు స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పు రామజన్మభూమికి అనుకూలంగా రావడం మెజారిటీ ప్రజలను మనోభావాలను గౌరవించినట్లయిందని అఖిల భారత ఐక్య ప్రజాస్వామ్య వేదిక (ఏఐయూడీఎఫ్) చీఫ్, లోక్ సభ సభ్యుడు బద్రుద్దిన్ అజ్మల్ ఇదివరకే స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై పున: సమీక్ష కోరాలని నిర్ణయించుకున్న సున్నీ వక్ఫ్ బోర్డు సైతం తన మనస్సును మార్చుకోవడం సంతోషకరమైన విషయమని చెప్పారు. వీలైనంత త్వరగా రామమందిరం నిర్మాణానికి పూనుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయోధ్యలో రాములోరికి పూజల్లేవ్..పునస్కారాల్లేవ్: 26 ఏళ్లుగా దీపారాధన ఒక్కటే!
అయోధ్య తీర్పును స్వాగతిస్తున్న ముస్లింలు..
తాజాగా షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు కూడా అయోధ్య తీర్పును స్వాగతించింది. సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా వచ్చిన తీర్పుల్లో ఇదే అత్యుత్తమమైనదని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీ రజ్వీ అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ తీర్పు నిలిచిందని అన్నారు. తీర్పు వెలువడిన ఇన్ని రోజుల తరువాత కూడా దేశంలో ఎక్కడ కూడా దీన్ని నిరసిస్తూ అవాంఛనీయ సంఘటనలు గానీ, మత ఘర్షణలు గానీ చోటు చేసుకోలేదని చెప్పారు. ముస్లింలు భారత ప్రజాస్వామ్యంలో అంతర్భాగమనే విషయాన్ని ఈ తీర్పు రుజువు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
రూ. 51 వేల విరాళం..
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని ప్రతి ముస్లిం కోరుకుంటున్నారని చెప్పారు. రామమందిరం నిర్మాణానికి ఇప్పటికే కొందరు ముస్లిం ప్రముఖులు ఇటుకలను అందించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను 51 వేల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎంత మొత్తం ఇచ్చామనేది ఇక్కడ సమస్య కాదని, రామమందిరం నిర్మాణంలో తానూ భాగస్వామిని అయ్యాననే తృప్తి కోసమే విరాళాన్ని ప్రకటించినట్లు రజ్వీ వెల్లడించారు. భవిష్యత్తులో అద్భుతమైన రామ మందిరం రూపుదిద్దుకోవడం ఖాయమని, ముస్లింలో దాన్ని సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు.
అస్సాం ముస్లింలు అయిదు లక్షల విరాళం..
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే గువాహటిలోని సదత్ గంజ్ ఏరియాలో నివసించే ముస్లిం కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచాను కాల్చి వేడుక చేసుకున్నారు. రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావాలని తాము ప్రార్థనలు చేశామని చెబుతున్నారు. శతాబ్దాల నాటి ఈ వివాదం ముగియడం ప్రజాస్వామ్యానికి చాలా మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల హిందు, ముస్లింల మధ్య సోదర భావం మరింత పెరుగుతుందని అంటున్నారు. అయోధ్యపై తీర్పు బాబ్రీ మసీదుకు ప్రతికూలంగా వెలువడినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్త లేదని, మతాలకు అతీతంగా భారతీయులందరూ శాంతిని కోరుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమని జేఎస్పీఏ ఛైర్మన్ సయ్యద్ ముమినుల్ అవోవల్ చెప్పారు.