జై శ్రీరాం అని పలుకు: దొంగతనం నెపంతో ముస్లింపై సామూహిక దాడి, వ్యక్తి మృతి
జార్ఖండ్ : మత స్వేచ్ఛపై అమెరికా ఇచ్చిన నివేదికను భారత ప్రభుత్వం ఖండించిన కొద్ది గంటల్లోనే మరో వార్త వెలుగు చూసింది. జార్ఖండ్ దొంగతనం చేశాడన్న నెపంతో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కొంతమంది చితకబాదారు. తీవ్రగాయాలపాలైన వ్యక్తి మృతి చెందాడు.
Recommended Video
దొంగతనం చేశాడని కొట్టి చంపారు
జార్ఖండ్ రాష్ట్రంలోని ఖార్సావాన్ జిల్లాలో జూన్ 18న ఈ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశాడని తార్బేజ్ అన్సారీ అనే వ్యక్తిని కొందరు 18 గంటల పాటు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన అన్సారీని పోలీసులు చికిత్స కోసం హాస్పిటల్లో చేర్చారు. చికిత్స పొందుతూ వ్యక్తి జూన్ 22న మృతి చెందాడు. ఇదిలా ఉంటే అన్సారీపై సామూహిక దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జై శ్రీరాం..జై హనుమాన్ పలకాలంటూ చితకబాదిన జనం
ఓ కర్రతో అన్సారీని ఓ వ్యక్తి చితకబాదుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. తనను వదిలివేయాల్సిందిగా అన్సారీ వేడుకుంటున్నాడు. మరో వీడియోలో మాత్రం 'జైశ్రీరాం' 'జైహనుమాన్' అనాల్సిందిగా అన్సారీని అక్కడి వారు బలవంతం పెడుతున్నట్లుగా స్పష్టంగా కనిపించింది. జూన్ 18న అన్సారీని చితకబాదిన స్థానికులు ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇక అప్పటినుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు అన్సారీ. తగిలిన దెబ్బలకు అతని పరిస్థితి విషమించడంతో అన్సారీని జూన్ 22న చికిత్స కోసం తరలించారు పోలీసులు. ఇక తాబ్రేజ్ అన్సారీ మృతికి కారణమైన పప్పు మండల్ అనే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
దొంగతనం చేయలేదు అని వేడుకున్నా కనికరించని వైనం
పూణేలో లేబర్గా పనిచేస్తున్న తాబ్రేజ్ అన్సారీ రంజాన్ కోసం తన సొంత గ్రామానికి వచ్చాడు. ఇక అప్పటి నుంచి తన గ్రామంలోనే ఉన్నాడు. పెళ్లి సంబంధం కుదరడంతో అన్సారీ అక్కడే ఉండాల్సి వచ్చింది. జూన్ 18న రాత్రి ఇద్దరు వ్యక్తులతో కలిసి జంషెడ్పూర్కు బయలుదేరాడు. అయితే అన్సారీని ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి తీసుకెళుతున్నారో తనకు కూడా తెలియదని ఓ సామాజిక కార్యకర్త తెలిపాడు. అన్సారీతో పాటు ఉన్న ఇద్దరు తప్పించుకుని పారిపోయారని... వీరి చేతికి అన్సారీ దొరికాడని తెలిపాడు. మరోవైపు ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేశారని తను మోటార్ సైకిల్ దగ్గర వేచిఉన్నట్లు అన్సారీ వేడుకున్నా.. వారు కనికరించలేదు.