సుప్రీంకోర్టుకు పౌరసత్వ సవరణ బిల్లు పంచాయతీ: రిట్ పిటిషన్ దాఖలు చేసిన ముస్లిం పార్టీలు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే అది చట్టరూపం దాలుస్తుంది.ఇక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే పార్లమెంటులో పాస్ అయిన పౌరసత్వ సవరణ బిల్లు.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంపై మోడీ-అమిత షా ఏం చెబుతున్నారంటే.. !
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయిన తర్వాత తొలిసారిగా చట్టపరమైన సవాలును ఎదుర్కోనుంది. బిల్లును సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంస్థ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయితే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అంతకుముందే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను బిల్లు ఉల్లంఘిస్తోందని రిట్ పిటిషన్లో దాఖలు చేసింది. మతప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడాన్ని తప్పుబట్టింది ఐయఎంఎల్.
బుధవారం రోజున పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో 9 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత బిల్లు ఓటింగ్కు వచ్చింది. 125-99 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లు పాస్ కావడాన్ని ప్రధాని మోడీ ఒక చరిత్రగా అభివర్ణించగా.. విపక్షాలు మాత్రం బిల్లును తప్పుపట్టాయి. మత ప్రాతిపదికన భారత పౌరసత్వం కల్పించడమనేది రాజ్యాంగ ఉల్లంఘన అని ధ్వజమెత్తాయి.
ప్రజాస్వామ్యంలో డిసెంబర్ 11వ తేదీ బ్లాక్డే అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. దేశంలో సమానత్వం కోసం పోరాడిన అగ్రగణ్యులను అవమానించేలా బిల్లు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సోనియాగాంధీ. హిందూత్వ అజెండాను భారత్లో అమలు చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని మాజీ కేంద్రమంత్రి చిదంబరం నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే దేశంలోని ముస్లింలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.