బెంగళూరులో అమానుషం: ముస్లిం మహిళ,ఆమె కొలీగ్పై దాడి-బైక్పై కలిసి వెళ్తున్నందుకు..
ఓ ముస్లిం మహిళతో పాటు ఆమె కొలీగ్పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.ఇద్దరు కలిసి బైక్పై వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తులు అడ్డగించారు. ఒక ముస్లిం మహిళవి అయి ఉండి... మరో కమ్యూనిటీకి చెందిన వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తావా... సిగ్గనిపించడం లేదా అంటూ ఆమెపై మండిపడ్డారు. తమ కమ్యూనిటీకి చెందిన మహిళను బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లడానికి ఎంత ధైర్యమంటూ ఆమె కొలీగ్ను ప్రశ్నించారు. వారు చెబుతున్నది వినిపించుకోకుండా ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. బెంగళూరులోని డైరీ సర్కిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది.వీడియోలో ఆ వ్యక్తుల మాటలను గమనిస్తే... 'నీ పేరేంటి... సిగ్గనిపించడం లేదా... మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో నీకు తెలియదా... ఇలా కుక్కల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు... నీలాంటి వాళ్లే మన కమ్యూనిటీ పరువు తీస్తున్నారు.' అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. తనకు పెళ్లయిందని... కొలీగ్తో కలిసి బైక్పై వెళ్తున్న విషయం తన భర్తకు తెలుసునని ఆమె చెప్పినా వినిపించుకోలేదు. ఆమె భర్త ఫోన్ నంబర్ చెప్పాల్సిందిగా బెదిరించారు. ఆమె అతని ఫోన్ నంబర్ చెప్పడంతో వెంటనే అతనికి ఫోన్ చేసి తిట్ల దండకం అందుకున్నారు.'ఓ నాన్ ముస్లిం వ్యక్తితో కలిసి వెళ్లేందుకు నీ భార్యను ఎందుకు అనుమతించావు.' అంటూ అతనిపై దుర్భాషలాడారు.
చివరకు,ఆమెను బలవంతంగా బైక్ పైనుంచి కిందకు దింపి... ఆటోలో ఇంటికి వెళ్లాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది.దీంతో ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఘటన జరిగిన 12 గంటల్లోనే వారిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఘటనపై స్పందించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని... ఉక్కు హస్తంతో అణచివేస్తామని అన్నారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని... వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు.