దారుణం: గోసంరక్షణ చేస్తోందని ముస్లీం మహిళపై దాడి, ఇంట్లోవాళ్లు కూడా..
భోపాల్: ఆవులను సంరక్షిస్తున్నందుకు ఓ ముస్లీం మహిళను ఆమె బంధువులే వేధించిన సంఘటన వెలుగు చూసింది. దీంతో ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి కాపాలంటూ విజ్ఞప్తి చేశారు. భోపాల్కు చెందిన మెహరున్నీసా ఖాన్ గోశాలను నిర్వహిస్తున్నారు.
ఇందుకుగాను కొందరు ఆమెపై దాడి చేశారు. ఆమె దాడి విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, తన ఇంట్లోని వారు కూడా తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. తనను ఇంటివారు, కుమార్తె కూడా ఉందని వాపోయారు. ఆమె ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కూడా విజ్ఞప్తి చేశారు.
ఆమె మాట్లాడుతూ.. గోశాలను నిర్వహిస్తున్నందుకు తమ బంధువులు కూడా మాటల దాడి చేస్తున్నారని చెప్పారు. తనను మాటలతో వేధిస్తున్నారని చెప్పారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే తాను సీఎంకు, ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఆమె రాష్ట్రీయ గోసేవా సమితి అధ్యక్షురాలిగా ఉన్నారు. నీమచ్ సమీపంలో గోశాలను నిర్వహిస్తున్నారు. తనను కిడ్నాప్ చేసి హత్య చేయాలని చూస్తున్నారని వాపోయారు. తనపై యాసిడ్ దాడి జరిగే అవకాశముందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలు కాపాడాలని కోరారు.
కాగా, మెహరున్నీసా గతంలో ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఆ సమయంలోను ఆమెకు చాలా బెదిరింపులు వచ్చాయి. మహిళల సమానత్వం కోసం ఆమె ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకించారు. కాగా, పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.