ముస్లిం సామాజిక వర్గంపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..మసీదులో వారు..!
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజకీయ సలహాదారుడు, ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేయరని వారు ఆయుధాలు చేత పడతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రేణుకాచార్య ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కొందరు కుట్రదారులు కూడా మసీదుల్లో ఉన్నారని వారు ఫత్వాలు రాస్తారని చెప్పారు. మారణాయుధాల కోసమే మసీదు ఉందా అని ఆయన ప్రశ్నించారు.
ముస్లింల కోసం కేటాయించిన నిధులు హిందువుల కోసం వినియోగించేందుకు తాను వెనుకాడబోమని రేణుకాచార్య అన్నారు. తన నియోజకవర్గంలో హిందువులకు నిధులను వినియోగిస్తానని చెప్పారు. ఇందుకు తాను ఎంతమాత్రం సంకోచించనని చెప్పుకొచ్చారు. ముస్లింలను తాము ఉన్న చోటే ఉంచి అసలు రాజకీయాలంటే ఏమిటో రుచిచూపిస్తానంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కర్నాటక బీజేపీ నేతలు ఇలా నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు.
అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి కూడా మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు చేసేవారికంటే హిందువులు ఎక్కువగా ఉన్నారని వారంతా ఒక్కసారి రోడ్డుపైకి వస్తే తట్టుకోగలరా అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాటలు అన్నీ అబద్దాలే అని చెప్పారు. వారిని నమ్మి వీధుల్లోకి రావడం సరికాదన్నారు. 80శాతం హిందువులు దేశంలో ఉన్నారని 17శాతం మంది మాత్రమే ముస్లింలున్నారని చెప్పారు. హిందువులు అంతా ఏకమైతే మీ పరిస్థితేంటంటూ ప్రశ్నించారు సోమశేఖర్ రెడ్డి.
ఇక గత కొద్ది రోజులుగా సీఏఏపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్న బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఏఏను నిరసిస్తున్న వారిని కుక్కలను కాల్చినట్లు కాల్చాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీష్ ఘోష్ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కర్నాటకల్లో తమ ప్రభుత్వం అదే చేసిందని గొప్పగా చెప్పుకుని విమర్శల పాలయ్యారు.