అయోధ్యలో జన్మించింది రాముడే, ప్రవక్త కాదు.. ముస్లింలకు కూడా తెలుసు.. రాందేవ్ బాబా
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించింది అయోధ్యలోనే అని యోగా గురువు రాం దేవ్ బాబా అన్నారు. ఈ విషయం దేశంలో ఉన్న ముస్లింలందరికీ తెలుసున్నారు. కానీ మహ్మద్ ప్రవక్త మాత్రం ఇక్కడ జన్మించలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లాంఛనమేనని స్పష్టంచేశారు.
త్వరలో పరిష్కారం..?
అయోధ్య రామ జన్మభూమి వివాదానికి పుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. త్వరలో వివాదాస్పద స్థలంలో రాముడి ఆలయం నిర్మించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయోధ్యలో రాముడు జన్మించిండనే విషయం ముస్లిం సోదరులందరీకి తెలుసుని ఉద్ఘాటించారు.
ఫుల్ సపోర్ట్
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు తాను బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్టు రాందేవ్ బబా పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 15 ఏళ్లలో అమెరికా, రష్యా, యూరప్తో సమానస్థాయిలో భారత్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుపరిపాలన అందించి, రాజకీయాలు కూడా పరిణితి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రశంసలు
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్పై రాందేవ్ బాబా ప్రశంసల జల్లు కురిపించారు. ఖట్టర్కు ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొన్నారు. ప్రజా సేవ చేసే గొప్ప వ్యక్తి అని కీర్తించారు. అవినీతిని ఏ స్థాయిలో కూడా ఖట్టర్ ఉపేక్షించబోరని తేల్చిచెప్పారు. అందుకే మరోసారి ఆయనకు పట్టం కట్టాలని కోరారు.
యోధులు
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్టికల్ 370 రద్దు చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాలను విలీనం చేసిన యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే.. అనంతరం కశ్మీర్ను దేశంలో విలీనం చేసిన ఘనత మోడీ, షాకే దక్కిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఓకే రాజ్యాంగం, ఓకే జెండా ఉండాలనే నినాదం గొప్పదని పేర్కొన్నారు. అందుకోసమే మోడీ-షా ద్వయం మరోసారి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని గుర్తుచేశారు.
మిగతా దేశాల్లో కూడా
ఆర్థిక మాంద్యంపై కూడా రాందేవ్ బాబా స్పందిస్తూ.. భారతే కాదు చాలా దేశాల్లో ఈ సమస్య ఉందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారని గుర్తుచేశారు. సమర్థమైన నాయకత్వంతో ఆర్థికమాంద్యం సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో మాంద్యం సమస్య గట్టెక్కుతుందనే ధీమా వ్యక్తం చేశారు. కానీ దేశంలో దళిత, మార్కిజం పేరుతో ఉగ్రవాదం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ స్వార్థం కోసం కొందరు కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.