ముస్లింలను తప్పుదోవ పట్టించారు - సీఏఏపై ఆర్ఎస్ఎస్ చీఫ్ - మేం బచ్చాగాళ్లమా?: ఓవైసీ కౌంటర్
కరోనా విపత్తు సమయంలోనూ దేశమంతా నిష్టతో విజయదశమి పండుగ జరుపుకొంటున్న మతాల నేపథ్యంలో నేతల వ్యాఖ్యలు వేడిపుట్టించాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ముస్లింలను తప్పుదోవ పట్టించారని, దానిపై హింసను ప్రేరేపిస్తున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రంలో ఆదివారం విజయదశమి సందేశమిస్తూ ఆయనీ కామెంట్లు చేశారు. దీనిపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
నన్ను చంపడానికి తాంత్రిక పూజలు -లాలూకు చేతబడి తెలుసు- దసరాకు జైల్లోనే జంతుబలి: మోదీ
ముస్లింల జనాభా అంటూ..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల ముస్లింల జనాభా తగ్గుతుందని లేనిపోని ప్రచారంతో కొందరు వారిని తప్పుదోవ పట్టించారని, సున్నితమైన అంశాన్ని ఆసరాగా తీసుకుని అవకాశవాదులు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చారని, నిరసనల పేరుతో వ్యవస్థీకృత హింసను ప్రేరేపించడం ద్వారా.. సామాజిక అశాంతి రగులుకుంటుదన్న సంగతిని అందరూ గుర్తించాలని మోహన్ భగవత్ అన్నారు. హిందూత్వ అనేది భారత జీవన విధానం అని, అధిపత్యం పేరిట తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
మళ్లీ అల్లర్లకు యత్నం..
‘‘పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలి. కానీ, అవకాశవాదులు కొందరు.. ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారు. అల్లర్లు, ఘర్షణల తర్వాత కరోనా మహమ్మారి రావడంతో అందరి దృష్టి వైరస్ పైకి వెళ్లింది. కొవిడ్ ప్రభావం తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో అల్లరి మూకలు, అవకాశవాదులు మళ్లీ సీఏఏ ఘర్షణలను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఏఏ ఏ మతానికీ వ్యతిరేకమైన నిర్ణయం కాదు'' అని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పష్టం చేశారు.
చైనా కంటే పవర్ఫుల్గా భారత్ - ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆకాంక్ష - అసలు నిజం భగవత్కు తెలుసన్న రాహుల్
నిరసనలు కొనసాగిస్తాం..
సీఏఏపై ముస్లింలను తప్పుదోవ పట్టించారంటూ మోహన్ భగవత్ చేసిన కామెంట్లపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ‘‘ఎవరో తప్పుదోవ పట్టించడానికి మేమేమైనా చిన్న పిల్లలమా? ఒక వేళ ఈ చట్టం ముస్లింలను టార్గెట్ చేయడానికి కానట్లయితే.. అందులో మతం ప్రస్తావన ఎందుకు చేశారు? భగవత్ చెబుతున్నదే నిజమైతే సీఏఏలో మతం ప్రస్తావన తొలగిస్తారా? మా భారతీయతను నిరూపించుకోవాల్సిన చట్టాలు పోయేదాకా మేం మళ్లీ మళ్లీ నిరసనలు చేస్తూనే ఉంటాం'' అని ఓవైసీ చెప్పారు.
బీహార్లో సీఏఏకు కౌంటరేది?
ప్రస్తుతం కొనసాగుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ సీఏఏపై తరచూ కామెంట్లు చేస్తోందని, పూర్వాంఛల్ వాసులు అందరినీ చొరబాటుదారులుగా చిత్రీకరిస్తున్నారని, ఇంత కీలకమైన అంశంపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముస్లింలకు అన్యాయం చేయడంలో బీజేపీతో సమాన పాత్ర కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకూ ఉందని ఆయన మండిపడ్డారు.