పౌరసత్వ సవరణ చట్టంపై కొందరు ముస్లింలు భయాన్ని సృష్టిస్తున్నారు: మోహన్ భగవత్
గోరఖ్పూర్: పౌరసత్వ సవరణ చట్టం గురించి సొంత సామాజిక వర్గంలోనే భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది ముస్లింలు పనిగట్టుకున్నారని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ సమావేశంలో మాట్లాడిన భగవత్... ఈ భయాన్ని తొలగించేందుకు భారత్లో చదువుకుని అత్యున్నత పదవుల్లో ఉన్న ముస్లింలు బయటకురావాలని పిలుపునిచ్చారు. ఈ భయాన్ని వారిలోనుంచి తొలగించే ప్రయత్నాలు చేయాలని భగవత్ కోరారు. దేశంలో హిందువులు, ముస్లింలు భారత పౌరులేనని పౌరసత్వ చట్టంను చూసి ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక కార్యకర్తలు తమ ఆదాయంలో నుంచి కొంత సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేయాలని చెప్పారు.
భారత సమాజంను కుల మతాలు వేరుచేయడం శాపంగా పరిణమించిందని అన్నారు భగవత్ . సమాజంలో ఐక్యత ఉండేలా అందరిని సమానత్వంతో చూసేలా కృషిచేయాలని భగవత్ అన్నారు. వివాదాలకు ఘర్షణలకు కార్యకర్తలు దూరంగా ఉండి ఆర్ఎస్ఎస్ సంస్థ విస్తరించేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతంపై గత 95 ఏళ్లుగా పనిచేస్తోందన్న మోహన్ భగవత్... అదే సిద్ధాంతాన్ని కొనసాగించాలని గాడి తప్పకూడదని చెప్పారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామి అయి... నాటి వైభవాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ శాఖలు ప్రతి గ్రామానికి విస్తరించాలని ఆమేరకు పనిచేయాలని కోరారు. ఇది 2025నాటికల్లా జరగాలని భగవత్ కార్యకర్తలకు ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ను విస్తరించడమే లక్ష్యంగా పని చేయాలని భగవత్ చెప్పారు. ఇక జనవరి 31న భాగవత్ మధ్యప్రదేశ్లోని గునలో పర్యటించనున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ నిర్వహించని ఒక కార్యక్రమంలో భాగవత్ పాల్గొంటారు. సంఘ్ పరివార్తో అనుబంధం ఉన్న విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఇక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లలోని ఆర్ఎస్ఎస్ విస్తరణపై భగవత్ దృష్టి సారిస్తారు.
గత 12 నెలలుగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రదర్శన సరిగ్గా లేదని చెప్పిన భగవత్... ఆ విషయాన్ని కూడా గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పారు. ముఖ్యంగా ఎన్ఆర్సీ సీఏఏలపై ప్రజల్లో అవగాహన నెలకొల్పేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని భగవత్ పిలుపునిచ్చారు.