రామ మందిరం: హిందువులకు ముస్లింలు సహకరించాలి, బంగారు ఇటుక ఇస్తా: ప్రిన్స్ యాకుబ్
నోయిడా: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశంలోని ముస్లింలు అందరూ హిందువులకు సహకరించి సోదరభావం చాటుకోవాలని చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ పిలుపునిచ్చారు. శనివారం అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
Ayodhya verdict: బాల్ థాక్రే సహా వారినే గుర్తు చేసుకోవాలి: అయోధ్యకు వెళతానంటూ ఉద్ధవ్
సుప్రీం తీర్పు చారిత్రాత్మకం..
అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని ప్రిన్స్ యాకుబ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును దేశంలోని ప్రజలందరూ సంతోషంగా స్వాగతించాలని అన్నారు.
రామమందిర నిర్మాణానికి ముస్లింలు సహకరించాలి..
అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు రావాలని ప్రిన్స్ యాకుబ్ వ్యాఖ్యానించారు. అప్పుడే నిజమైన సెక్యూలరిజమ్, మత సామరస్యం ప్రపంచం ముందు ఉంచినట్లవుతుందని ఆయన అన్నారు..
ప్రధానికి బంగారు ఇటుక అందిస్తా..
తాను అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి బంగారు ఇటుక ఇస్తానని హామీ ఇచ్చానని, తాను ఆ హామీని నెరవేర్చుకుంటానని ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణానికి పునాది వేయగానే.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి బంగారు ఇటుకను బహూకరిస్తానని చెప్పారు.
అయోధ్యలోనే రాముడు..
కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.