Ayodhya Verdict: అయోధ్య వివాదాస్పద భూమి హిందువులకు.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పదమైన భూమిని హిందువులకు దక్కుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. అయోధ్య వివాదాస్పద భూమిని హిందువులకు కేటాయించడానికి అవసరమైన నిబంధనలను రూపొందించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని సూచించింది. అయిదు ఎకరాల భూమిని సున్నీ వక్ప్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాదాస్పద భూమిని రామ మందిరం ట్రస్టు బోర్డుకు అప్పగించాలని తీర్పు ఇచ్చింది.
Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు
రామమందిరం ట్రస్టు బోర్డుకు వివాదాస్పద స్థలం..
రామమందిరం ట్రస్టు బోర్డుకు వివాదాస్పద స్థలం చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భూమిని బదలాయించడానికి అవసరమైన నియమ, నిబంధనలు ఎలా ఉండాలనే అంశం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని, దీనికి అవసరమైన నిబంధనలను మూడు నెలల్లోగా రూపొందించాలని పేర్కొంది. రామ్ లల్లా స్థలం దేశ శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ప్రాంతమని పేర్కొంది. వివాదాస్పద స్థలం అంతర్గత ప్రదేశంలో ముస్లింలు నమాజ్ చేశారనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆలయం ఉన్న చోట బాబ్రీ మసీదు నిర్మాణం..
అదే సమయంలో ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదును నిర్మించలేదని వెల్లడించింది. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిందనడానికి అవసరమైన చారిత్రక ఆధారాలు లేవని, ఆలయం ఉన్న ప్రదేశంలో మసీదు నిర్మాణం జరిగిందనడానికి సాక్ష్యాధారాలు లభించాయని వెల్లడించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 2.77 ఎకరాల స్థలం నజుల్ భూమి అనడంలో ఎలాంటి సందేహాలు లేవని పేర్కొంది. ఈ ప్రదేశాన్ని హిందువులు, ముస్లిం భక్తులు తమ పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారని స్పష్టం చేసింది. ఆలయం ఉన్న చోటే మసీదును నిర్మించారనడానికి కావాల్సినన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించిది.
అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడనటానికి..
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధారాలు దీన్ని నిర్ధారించట్లేదని అన్నారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదును నిర్మించలేదని, మసీదును నిర్మించిన ప్రదేశం అంతకుముందు ఖాళీగా ఉండేదనడానికి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. దాని కింద ఆలయ నిర్మాణాలు ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. అయోధ్యలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడనటానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు చారిత్రాత్మకమైనవిగా గుర్తించామని రంజన్ గొగొయ్ చెప్పారు. శ్రీరాముడు జన్మించిన, నడయాడిన ప్రదేశంగా భావించే ఆధారాలు ఉన్నాయని అన్నారు.