నకిలీ ఐఏఎస్: నకిలీ గుర్తింపు కార్డు, అకాడమీలో ఉండేందుకు 5 లక్షలు లంచం...!
న్యూఢిల్లీ: ముస్సోరిలోని 'లాల్ బహూదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ'లో ఒక నకిలీ మహిళా ఐఏఎస్ ఆరు నెలలు బస చేసిన వివాదం కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే, రూబీ చౌధురి అనే మహిళ అకాడమీలో ఆరు నెలలకు పైగా ఉన్నారనే ఆరోపణలతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ముస్సోరీ పోలీస్ స్టేషన్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అక్కడ ఉండేందుకు అకాడమీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ సౌరభ్ జైన్ తనకు నకిలీ గుర్తింపు కార్డు ఇచ్చారనీ, అందుకు గాను రూ. 5 లక్షలు లంచం తీసుకున్నారని తెలిపింది.
రూ. 20 లక్షలిస్తే అక్కడ లైబ్రరీలో ఉద్యోగం ఇప్పిమన్నాడు. ప్రస్తుతానికి అతనికి రూ. 5 లక్షలు ఇవ్వగా, మిగిలిన మొత్తాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపింది. ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్న ఉత్తరాఖండ్ డీజీపీ 2,3 రోజుల తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్టాత్మకమైన ముస్సోరీలోని 'లాల్ బహూదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ'లో ఓ నకిలీ మహిలా ఐఏఎస్ సుమారు ఆరు నెలలు పాటు బస చేసింది. నకిలీ పత్రాలతో ఐఏఎస్ ట్రైనీనంటూ వచ్చి అకాడమీలో చేరి, ఆరు నెలలు పాటు దర్జాగా ఉంది.
ఈ విషయంపై అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె ఆచూకీ కనుగొనేందుకు దర్యాప్తును చేపట్టారు. ముస్సోరీ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముజఫర్ నగర్కు చెందిన రూబీ చౌధురిగా తనను తాను పరిచయం చేసుకున్న ఆ మహిళ గత సెప్టెంబర్ 20న తారీఖున అకాడమీకి వచ్చింది.
అనంతరం అకాడమీలో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు చూపించి ప్రవేశం పొందినట్లు అధికారులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 'లాల్ బహూదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ'లో ఉన్న అన్ని రోజులు లైబ్రరీని ఉపయోగించుకునే సందర్భంలో తనని ఓ ఐఏఎస్ ఆఫీసర్గా పరిచయం చేసుకొనేదని లైబ్రరీ వర్గాలు తెలిపాయి.
అయితే ఆమె ఉన్నట్టుండి మార్చి 27 నుంచి కనిపించకపోవడంతో అధికారులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్టుదిట్టమైన భద్రతతో ఉండే అకాడమీలోకి ఆమె అసలు ఎలా ప్రవేశించిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె గది నుంచి మార్క్ లిస్ట్ల పాటు, ఏటీఐ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్న పత్రాలను ఎఫ్ఐఆర్కు జత చేశారు.