భారత్ బంద్: భాగ్యనగరంలో కమ్యూనిస్టుల ఆందోళన, మిగతాచోట్ల అంతంతమాత్రమే, ఏపీలో..
పెట్రో ధరల పెంపుపై ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగింది. అయితే తెలంగాణలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా బంద్ ఎఫెక్ట్ చూపించలేదు. పెట్రో ధరలు, వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ ఇతర నగరాల్లో మాత్రమే షాపులు మూసివేసి కనిపించాయి. బంద్ ప్రభావం జనజీవనంపై పెద్దగా కనిపించలేదు. ట్రక్ ఓనర్లు బంద్కు మద్దతు తెలిపిన రవాణాపై ఎఫెక్ట్ చూపలేదు. బంద్కు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. బంద్తో ఇవాళ దాదాపు లక్ష వాహనాలు రోడ్డెక్కలేదు అని తెలిపింది. డీజిల్పై కేంద్ర పన్ను తొలగించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది.
తమ డిమాండ్లపై కేంద్రం స్పందించాలని.. లేదంటే నిరవధికంగా స్ట్రైక్ చేస్తామని ట్రక్ ఆపరేటర్లు బెదిరిస్తున్నారు. హైదరాబాద్లో కిరాణా, స్టీల్ సాపు ఓనర్లు ర్యాలీ తీశారు. తర్వాత కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. పెట్రోల్ను జీఎస్టీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. కొత్త క్లాజులు, నిబంధనలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఆందోళనకు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నేతృత్వం వహించారు. పెట్రో ధరలను జీఎస్టీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
బంద్కు సీపీఎం కూడా మద్దతు తెలిపింది. ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ వద్ద ధర్నా చేపట్టారు. వంట గ్యాస్ ధర కూడా పెంచడం సరికాదని ఆ పార్టీ నేతలు అన్నారు. పెట్రో ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్రో ధరలు సామాన్యుడికి గుదిబండలా మారాయని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్ర, రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇటు ఏపీలో కూడా భారత్ బంద్ కొనసాగింది. పెట్రో ధరలను తగ్గించాలని ఆందోళన చేపట్టారు.