ముత్తూట్ ఫైనాన్స్ ఎండీపై భీకరదాడి.. నడిరోడ్డుపై రాళ్లతో కొట్టిచంపాలని.. విస్తుపోయే వాస్తవాలు
ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీగా కొనసాగుతోన్న ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ పై మంగళవారం భీకరదాడి జరిగింది. కొచ్చిలో ఆయన ప్రయాణిస్తున్న కారును గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపైనే ఆపేసి.. పెద్ద పెద్ద బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను బద్దలు కొట్టుకుంటూ దూసుకొచ్చిన రాళ్ల దెబ్బకు ఆయన తల పగిలిపోయింది. వెనకాలే వేరే కారులో వచ్చిన సిబ్బంది.. తీవ్రంగా గాయపడ్డ ఎండీని హుటుహుటిన ఆస్పత్రికి తరలించారు.
సీపీఎం ప్రోద్బలంతోనే?
ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జి అలెగ్జాండర్ పై దాడి వెనుక కేరళ అధికార పార్టీ సీపీఎం ప్రోద్బలం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఇన్వెస్టర్ల సదస్సు ఇంకో రెండ్రోజుల్లో జరుగనుండగా, ఈలోపే ఒక పెద్ద ఫైనాన్సింగ్ కంపెనీ ఎండీపై పట్టపగలే హత్యాయత్నం జరగడం రాష్ట్రంలో కలకలకం రేపింది. సీపీఎం అనుభంద కార్మిక సంఘం ‘సెంటర్ ఆప్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ)‘ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ముత్తూట్ యాజమాన్యం అనుమానిస్తోంది.
సిబ్బంది వర్సెస్ యాజమాన్యం
దేశవ్యాప్తంగా 5వేలకుపైగా బ్రాంచ్ లు.. 30 వేలకుపైగా సిబ్బంది ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో కొంత కాలంగా సిబ్బందికి, యాజమాన్యానికి పొసగడంలేదు. మరీ ముఖ్యంగా సంస్థ హెడ్ క్వార్టరైన కేరళలో గొడవలు బాగా ముదిరాయి. కేరళలో ముత్తూట్ కు 600 బ్రాంచ్ లు, 3వేలమందికిపైగా సిబ్బంది ఉన్నారు. ప్రైవేటు సంస్థే అయినా, కేరళ బ్రాంచ్ ల్లో పనిచేస్తున్న చాలా మంది సీఐటీయూకు అనుబంధంగా కొనసాగుతున్నారుజ
దారి తప్పిన పోరాటం..
జీతాల పెంపు,ఇంక్రిమెంట్లు కోరుతూ కేరళలో మూత్తూట్ సిబ్బంది గత మూడు నెలలుగా ఉద్యమిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎండీ జార్జికి పోలీస్ సెక్యూరిటీ కూడా కల్పించారు. రూల్స్ కు విరుద్ధంగా యూనియన్లతో కలిసి సిబ్బంది గొడవచేయడాన్ని సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం.. ఒకేసారి 166 మందిపై వేటేసింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అంతమందిని ఎలా తొలిగిస్తారంటూ మిగతా సిబ్బంది ఆగ్రహించారు.
ఒక దశలో ఉద్యోగులు
ఒక దశలో.. ఉద్యోగులు దిగిరాకుంటే సంస్థను మూసేస్తానంటూ ఎండీ హెచ్చరికలు జారీ చేయడం మరింత గందరగోళానికి దారితీసింది. మంగళవారం తన ఉద్యోగులతో కలిసి కాన్వాయ్ గా వెళ్తున్న ఎండీపై దాడి చేసింది సీఐటీయూ గుండాలేనని ముత్తూట్ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి పాల్పడ్డవారిలో ముత్తూట్ సిబ్బంది ఉన్నారా? లేరా? అనే విషయం తెలియాల్సిఉంది.