ఎట్టకేలకు గుడ్ న్యూస్... చైనాతో చర్చలపై భారత ఆర్మీ కీలక అప్డేట్...
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కమాండర్ స్థాయి చర్చలు సఫలం అవుతాయా.. కాదా అన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం నుంచి సుమారు 11గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు సఫలమైనట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. తూర్పు లదాఖ్లోని వివాదాస్పద ప్రాంతంలో బలగాలను వెనక్కి రప్పించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Recommended Video
ఆర్మీ వర్గాలు ఏమంటున్నాయి...
'మోల్దోలో భారత్,చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు సానుకూల వాతావరణంలో అర్థవంతంగా ముగిశాయి. తూర్పు లదాఖ్లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అక్కడి నుంచి సైనికులను వెనక్కి తీసుకునే పద్దతులపై చర్చలు జరిగాయి. ఆ మేరకు ఇరు దేశాలు ముందుకెళ్లనున్నాయి.' ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఘర్షణలు,ఉద్రిక్తతలకు తెరపడినట్టేనా..?
చైనా వైపునున్న చుషుల్ సెక్టార్లోని మోల్దోలో సోమవారం(జూన్ 22) ఉదయం 11.30గంటలకు భారత్,చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు మొదలయ్యాయి. సుమారు 11గం. పాటు ఈ చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి. ఎట్టకేలకు చర్చలు సానుకూలంగా ముగియడంతో ఇకపై లదాఖ్ సరిహద్దులో భారత్-చైనా మధ్య ఘర్షణలకు తెరపడి శాంతియుత వాతావరణం నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకుముందు,జూన్ 6న మొదటిసారి ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్స్థాయి చర్చలు జరిగాయి. నిజానికి అప్పుడే గాల్వన్ వ్యాలీలో సైన్యాలను ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.
భారత్ విస్తృత సమాలోచనలు...
కానీ ఆ తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా టెంట్లను నిర్మించడం,భారత్ సైన్యం వాటిని తగలబెట్టడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు,40 మంది చైనా సైనికులు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత చైనా దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని భారత్ విస్తృతంగా సమాలోచనలు జరిపింది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు.దౌత్యపరంగా ముందుకెళ్లాలా.. యుద్ద నీతినే ప్రదర్శించాలా అన్నదానిపై లోతుగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో ముందుగా కమాండర్ స్థాయి చర్చలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఎట్టకేలకు ఇప్పుడా చర్చలు సఫలమవడం సరిహద్దు ఉద్రిక్తల నుంచి కాస్త ఉపశమనం కలిగించే విషయమే.
లదాఖ్లో ఆర్మీ చీఫ్ పర్యటన
మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే మంగళవారం(జూన్ 23) లదాఖ్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. చైనాతో గత నెలన్నర రోజులుగా సరిహద్దులో తలెత్తుతున్న వివాదం,ఘర్షణలపై నరవణే గ్రౌండ్ కమాండర్స్తో చర్చించనున్నారు. అలాగే ఇటీవల చైనాతో ఘర్షణల్లో గాయపడ్డ సైనికులను కూడా పరామర్శించనున్నారు.